నమోదు కాని 96 వేలమంది పిల్లల వివరాలు | 96 thousands of students names are not registered | Sakshi
Sakshi News home page

నమోదు కాని 96 వేలమంది పిల్లల వివరాలు

Aug 12 2014 2:50 AM | Updated on Jul 26 2019 6:25 PM

అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల పుణ్యమా అని 96 వేల మంది విద్యార్థులు రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలకు దూరం కానున్నారు.

అనంతపురం ఎడ్యుకేషన్ : అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల పుణ్యమా అని 96 వేల మంది విద్యార్థులు రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలకు దూరం కానున్నారు. ఇప్పటికైనా ఆయా పాఠశాలల యాజమాన్యాలు తేరుకోకపోతే మాత్రం వీరందరికీ అన్యాయం చేసినట్టవుతుంది. ఇంతకాలం పాఠశాలల్లో చదువుతున్నట్లు రికార్డుల్లో ఉంటే చాలు మధ్యాహ్న భోజన పథకం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్కాలర్‌షిప్‌లతో పాటు పథకాలు మంజూరయ్యేవి. రికార్డుల్లో పేర్లున్న విద్యార్థులు ఫిజికల్‌గా ఉన్నారా... లేదా అనేది సంబంధం లేదు.

చాలామంది పిల్లల పేర్లు అటు ప్రభుత్వ పాఠశాలలు, ఇటు ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఉన్నట్లు (డ్యూయల్ ఎంట్రీ) ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. ఇంకా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనైతే రికార్డుల్లో చూపించిన విద్యార్థులు అసలే ఉండరు. కేవలం పోస్టులు కాపాడుకునేందుకు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారులను తప్పుదారి పట్టించడమే కాకుండా పథకాల అమలులో అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. ఈ అంశాలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. డ్యుయల్ ఎంట్రీ, లేని విద్యార్థులను ఉన్నట్లు రికార్డుల్లో చూపించడం వంటివాటికి చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది.
 
చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదు
2012-13 విద్యా సంవత్సరం యూనిఫైడ్ డి స్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్) జాబితాలో ఉన్న స్కూళ్లలో 1-10 తరగతులు చదువుతున్న విద్యార్థి పేరు, తరగతి, ఊరు, కులం, తల్లిదండ్రులు, వార్షిక ఆదాయం, ఆధార్ నంబరు తదితర సుమారు 24 అంశాలను పరిగణనలోకి తీసుకుని చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదు చేయాల్సి ఉంది. ఒక విద్యార్థి వివరాలు ఒకసారి మాత్రమే నమోదుకు అవకాశం ఉంటుంది.
 
నమోదు కాని 96 వేలమంది పిల్లల వివరాలు
జిల్లాలో చదువుతున్న దాదాపు లక్షమంది విద్యార్థుల వివరాలను ఇప్పటిదాకా నమోదు చేయలేదు. వీరందరూ ఎక్కడ చదువుతున్నారు.. అసలు ఉన్నారా.. లేదా అని తెలియక విద్యా శాఖ తల పట్టుకుంటోంది. సుమారు ఆర్నెళ్లకుపైగా జిల్లాలో చైల్డ్ ఇన్‌ఫో కార్యక్రమం విడతల వారీగా చేపడుతున్నారు. 1-10 తరగతుల విద్యార్థులు 6,10,543 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటిదాకా 5,14.064 మంది పిల్లల వివరాలను నమోదు చేశారు. తక్కిన 96,479 మంది పిల్లల వివరాలు నమోదు కాలేదు. వీరిలో ప్రైవేట్ పాఠశాలల్లోనే ఎక్కువమంది ఉన్నారు. వీరంతా ఎక్కడున్నారనే దానిపై ఎస్‌ఎస్‌ఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఛిజ్చిజీఛీజీజౌ.్చఞ.జీఛి.జీ వెబ్‌సైట్‌లో పిల్లల వివరాలను నమోదు చేయాలని ఎస్‌ఎస్‌ఏ పీఓ మధుసూదన్‌రావు కోరుతున్నారు.
 
ప్రైవేట్ పాఠశాలల నిర్లక్ష్యం
చైల్డ్ ఇన్‌ఫో నమోదులో ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన మేరకు నమోదు చేస్తున్నా, ప్రైవేట్ పాఠశాలలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఆర్నెళ్లకుపైగా అధికారులు వెంట పడుతున్నా.. నేటికీ ఈ ప్రక్రియ ప్రారంభించని ప్రైవేటు పాఠశాలలు చాలానే ఉన్నాయి. కొన్ని ప్రైవేటు స్కూళ్లలో కొందరి విద్యార్థుల వివరాలు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఒక సెక్షనుకు అనుమతి తీసుకుని రెండు మూడు సెక్షన్లు నిర్వహిస్తుంటారు. అదనపు సెక్షన్లలో ఉండే విద్యార్థులను నమోదు చేయడం లేదని తెలిసింది. దీనికితోడు 2012-13 విద్యా సంవత్సరం డైస్ జాబితా మేరకు నమోదు చేస్తుండడంతో 2013-14లో నూతనంగా ప్రారంభమైన పాఠశాలల పిల్లలను నమోదు చేయడం లేదు. అయితే జిల్లా అధికారులు ఒక ప్రత్యేక ప్రొఫార్మా తయారు చేసి ఇలాంటి పాఠశాలల పిల్లల వివరాల నమోదుకు చర్యలు తీసుకుంటున్నారు.  
 
విద్యార్థులకు నష్టం
చైల్డ్‌ఇన్‌ఫో నమోదు చేయకపోతే సదరు విద్యార్థికి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ఫలాలు అందవు. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదైన విద్యార్థులను మాత్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. నమోదు కాని విద్యార్థులు నష్టపోనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే అధికారులు ఎంఈఓలు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయుల వెంట పడుతున్నారు. అయినా ఆశించిన ఫలితం రావడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement