కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నగదు బదిలీ పథకం ప్రహసనంగా మారింది.
=60 శాతం మందే ఆధార్ నమోదు
=గ్యాస్కు ఎత్తివేయాలని డిమాండ్
=పింఛనుదారుల కొంపముంచుతున్న పథకం
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నగదు బదిలీ పథకం ప్రహసనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా లబ్ధిదారులకు అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని అమలులో వచ్చే లోపాలను అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి పింఛన్లు పొందే పేదలు, వృద్ధులు, వింతతువులు, వికలాంగులు ఈ పథకంలోని లోపాలకు బలి అవుతున్నారు. దీని గురించి పూర్తిగా వారికి అవగహన లేకపోవడంతో పాట్లు పడక తప్పడం లేదు.
పూర్తికాని ఆధార్ నమోదు
గత సెప్టెంబర్ 1 నుంచి జిల్లాలో నగదు బదిలీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పథకం అమలు చేసిన తరువాత కూడా మూడు నెలల గడువు ఇచ్చింది. ఇది నవంబర్ నెలాఖారుతో ముగుస్తుంది. డిసెంబర్ 1 నుంచి ప్రతిఒక్కరూ సబ్సిడీ లేని సిలిండర్నే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తొలుత సబ్సిడీ లేకుండా గ్యాస్ ఏజెన్సీలో రూ. 1120 చెల్లించి కొనుగోలు చేస్తే వారి బ్యాంకు ఖాతాకు సబ్సిడీ జమ అవుతుంది.
అందువల్ల గ్యాస్ వినియోగదారులు ఈ నెలాఖరులోగా తమ ఆధార్కార్డు, బ్యాంకు అకౌంట్ నంబర్లను గ్యాస్ ఏజెన్సీలో నమోదు చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో 10,80,704 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 6,67,003 (62 శాతం) మంది మాత్రమే ఆధార్ నంబరు నమోదు చేయించుకోగా, 3,95,721 (35 శాతం) మంది మాత్రమే బ్యాంకు అకౌంట్ నంబర్లు ఇచ్చారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన గ్యాస్ వినియోగదారులు ఈ నెలాఖరులోగా తమ ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు జమ చేయించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం గ్యాస్పై ఇచ్చే సబ్సిడీని కోల్పోవాల్సి వస్తుంది.