ధాన్యం కొనుగోళ్లకు 167 కేంద్రాలు | 167 grain purchase centers | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు 167 కేంద్రాలు

Oct 19 2013 12:12 AM | Updated on Sep 1 2017 11:45 PM

ఖరీఫ్‌కు సంబంధించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఖరీఫ్‌కు సంబంధించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వీలుగా జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆధార్ అనుసంధానం, నిత్యావసర సరుకుల పంపిణీ ఇతర అంశాలపై పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన సాధారణ రకం వరి ధాన్యం క్వింటాల్‌కు రూ.1,310, గ్రేడ్-ఏ రకం ధాన్యానికి రూ. 1,345లకు తగ్గకుండా కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలుకు ఐకేపీ ద్వారా 119 కేంద్రాలు, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా 48 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం మార్కెట్‌లోకి వస్తుందని ఆ ప్రకారం కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.
 
 ధాన్యం కొనుగోళ్లపై స్వయం సహాయక సభ్యులకు పూర్తి స్థాయి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాలకు అవసరమైన ప్యాడి, పవర్ క్లీనర్స్, మాయిశ్చరైజ్ మీటర్లు, తూకం యంత్రాలు, టార్పాలిన్లు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆమె మార్కెటింగ్ శాఖ ఏడీకి సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను 72 గంటల్లోగా రైతు ఖాతాలో జమ చేస్తామన్నారు. రైతులు ఎదుర్కొనే సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎ.శరత్, వ్యవసాయ శాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డీఎస్‌ఓ ఏసు రత్నం, మార్కెటింగ్ ఏడీ నవీన్‌రెడ్డి, ఆర్డీఓలు ముత్యంరెడ్డి, వనజాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement