breaking news
-
మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి: చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం
తాడేపల్లి: ఇచ్చిన హామీలను అమలు చేయకండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ అధ్యక్షడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు చంద్రబాబు హామీల మోసాన్ని ‘ఎక్స్’ వేదికగా ఎండగట్టారు వైఎస్ జగన్ 1, చంద్రబాబు గారూ… ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్-6, సూపర్-7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు కొనసాగుతూనే ఉన్నాయి. 2. మా ప్రభుత్వంలో అత్యంత సమర్థవంతంగా అమలైన రైతుభరోసా పథకాన్ని దారుణంగా దెబ్బతీశారు. మీ హామీ ఒక మోసం, మీ ష్యూరిటీ ఇంకో మోసం, మీ బాండ్లు మరో మోసం, మీరిచ్చిన గ్యారెంటీ పచ్చి మోసమే.3. ఇవాళ దర్శి సభలో మీ నోటితో మీరు చెప్పినట్టుగా, మీరు ఉన్నంతవరకూ రైతులకు భరోసా లేదన్నది ముమ్మాటికీ వాస్తవమే. 4. చంద్రబాబుగారూ మా ప్రభుత్వం వచ్చిన కేవలం 4 నెలల కాలంలోనే, ప్రభుత్వ ఖజానాలో రూ.100 కోట్లు కూడా లేని పరిస్థితులున్నా సరే, అక్టోబరు, 2019లో రైతు భరోసా పథకం అమలు ప్రారంభించి ఆ ఐదేళ్లు క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం అందించి, సంక్షోభంలో ఉన్న రైతులకు అండగా నిలిచింది. ఏ ఏడాది ఎప్పుడు ఇస్తామో క్యాలెండర్ ద్వారా ప్రకటించేవాళ్లం. కాని, మీరు గత ఏడాది ఇవ్వాల్సిన రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టి, ఒక్కపైసా కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 5. మా 2019, మేనిఫెస్టోలో 4 ఏళ్లలో రైతులకు ఏటా రూ.12,500 వేలు చొప్పున ఇస్తామని వాగ్దానం చేస్తే, దానికంటే మిన్నగా, మరో రూ.1000 పెంచి వరుసగా 5 ఏళ్లు ప్రతి ఏటా రూ.13,500 ఇచ్చి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. రైతులకు పెట్టుబడి సహాయం కింద రూ.34,288.17 కోట్లు అందించి రికార్డు సృష్టించాం.1.@ncbn గారూ… ఎన్నికలకు ముందు అధికారం కోసం మీరు హామీలు ఇవ్వడమేకాదు, వాటికి ష్యూరిటీ కూడా ఇస్తారు, నమ్మించడానికి బాండ్లు కూడా ఇంటింటికీ పంచుతారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్యారెంటీగా మోసం చేస్తారు. ఇది ఇవాళ మరోసారి నిజమైంది. సూపర్-6, సూపర్-7 పేరిట ప్రజలకు మీ వెన్నుపోట్లు…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 20256. కాని, చంద్రబాబుగారూ మీరు కేంద్రం ఇచ్చే రూ.6వేలు కాకుండా, మీరు ఏటా రూ.20వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తానన్న హామీని మంటగలిపారు. ఈ రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కో రైతుకు రూ.40వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంటే, ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.5వేలు. అదికూడా ఎంతమందికి చేరిందో తెలియదు. ఖరీఫ్ సీజన్ మొదలై 2 నెలలు అయిపోయినా, పెట్టుబడి సాయం చేయకుండా మళ్లీ రైతులను వడ్డీ వ్యాపారులవైపు, ప్రైవేటు అప్పులవైపు మళ్లించారు.7. మా ప్రభుత్వ హయాంలో 53.58 లక్షల మందికి పెట్టుబడి సహాయం ఇస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా సవాలక్ష నిబంధనలు పెట్టి, సుమారు 7 లక్షల మందికి ఎగ్గొట్టి, రైతులకు అన్యాయం చేశారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? వాగ్దానాల అమల్లో మీకు చిత్తశుద్ధిలేదని ప్రజలకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వారిని మభ్యపెట్టడానికి దర్శిలో ఈ మోసపూరిత కార్యక్రమాన్ని, సినిమా సెట్టింగుల తరహాలో చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.8. చంద్రబాబుగారూ…, వైయస్సార్సీపీ హయాంలో అనేక విప్లవాత్మక సంస్కరణలతో, అంతకుముందు మీరు నాశనం చేసిన వ్యవసాయ రంగాన్ని మళ్లీ నిలబెడితే, ఇప్పుడు మళ్లీ సర్వనాశనం చేస్తున్నారు.9. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని పరిస్థితి. మేం ధరల స్థిరీకరణ నిధినిపెట్టి, తద్వారా రూ.7,800కోట్లు ఖర్చుచేసి రైతులను ఆదుకున్నాం. కాని, మీరు దాన్ని రద్దుచేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేశారు.10. రైతులకు అందే సున్నా వడ్డీ పథకాన్ని ఎత్తివేశారు.11. మేం ప్రవేశపెట్టి, అమలుచేసి, అనేక వైపరీత్యాల సమయంలో రూ.7,802.5 కోట్లు అందించి, రైతులను విశేషంగా ఆదుకున్న ఉచిత పంటల బీమాను రద్దుచేశారు. ఇన్సూరెన్స్కోసం రైతులు ఇప్పుడు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. గత ఏడాదికూడా మీరు బీమా సొమ్ములు కట్టకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. .12.ఆర్బీకేలను, ఇ-క్రాప్ను, టెస్టింగ్ ల్యాబులను నిర్వీర్యంచేశారు.13. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులను, పురుగు మందులను సర్టిఫై చేసి మేం అందిస్తే, తిరిగి మీరు మీ సిండికేట్ ముఠాలను ప్రోత్సహించి ఉద్దేశ పూర్వకంగా వాటి కొరతను సృష్టించి రైతులను దోచుకునే పరిస్థితికి తీసుకు వచ్చారు.14 .రాష్ట్రవ్యాప్తంగా సుమారు 250 మందికిపైగా రైతులు ఆత్మహత్యచేసుకోవడం, ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఏ రైతుకూ భరోసా లేకపోవడం, వ్యవసాయరంగంలో చోటుచేసుకున్న దారుణ పరిస్థితులకు నిదర్శనం. కనీసం ఆ కుటుంబాలను కూడా ఆదుకోకపోవడం, మీ అమానవీయతకు, నిస్సిగ్గుతనానికి ఇంకో నిదర్శనం. -
తిరువూరు టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై తిరువూరు తమ్ముళ్ల తిరుగుబాటు జెండా ఎగురవేశారు. టీడీపీ పార్టీని, ప్రభుత్వాన్ని, ఎంపీని ఎమ్మెల్యే కొలికపూడి అల్లరి చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎమ్మెల్యే.. పార్టీని, ఎంపీని బదనాం చేస్తున్నారు.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎమ్మెల్యేకి కనిపించడం లేదు.. ఎమ్మెల్యే వైఖరిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అంటూ మండిపడ్డారు.‘‘ఒక పథకం ప్రకారమే ఎమ్మెల్యే కొలికపూడి ఇలా చేస్తున్నారు. కొలికపూడితో వివాదాలన్నీ టీడీపీ వారితోనే. ఎమ్మెల్యే కొలికపూడి వల్ల టీడీపీ తీవ్రంగా నష్టపోతోంది. కొలికపూడిని ఎంపీ కేశినేని చిన్ని కోట్లు ఖర్చుపెట్టి గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి పార్టీకి, ఎంపీకి నమ్మకంగా ఉండాలి. ఏవైనా మనస్పర్థలు ఉంటే మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. తిరువూరులో పార్టీ, ప్రభుత్వం, ఎంపీ అల్లరవుతున్నారు తప్ప.. ఏం అభివృద్ధి జరిగింది’’ అంటూ తిరువూరు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.కాగా, తిరువూరు టీడీపీలో ఇసుక పంచాయతీ మళ్లీ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు బెదిరింపులకు దిగడం గమనార్హం. -
‘ఇచ్చిన మాట తప్పిన చంద్రబాబు సమాధానం చెప్పాలి’
విజయవాడ: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో శనివారం(ఆగస్టు 2) బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాల్లాది విష్ణుతో పాటు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో హామీలిచ్చారు. జగన్ కంటే ఎక్కువ పథకాలిస్తామని చంద్రబాబు చెప్పారు. జగన్ రూ.13 వేలు రైతు భరోసా కింద రైతులకు అందించారు. ఐదేళ్లలో రూ. 34,288 కోట్లు రైతులకు ఇచ్చారు. చంద్రబాబు 20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఈరోజు చంద్రబాబు కేంద్రం ఇచ్చినదాంతో కలిపి ఏడు వేలు మాత్రమే ఇచ్చారు. జగన్ ఐదేళ్లూ రైతు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏడు లక్షల మంది రైతులకు కోత పెట్టింది. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని కబుర్లు చెప్పారు. ఇచ్చిన మాట తప్పినందుకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేస్తున్నారు’ అని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. -
‘అదే జరిగితే నిజాలు బయటకు.. సిట్ అధికారుల్లో కలవరం’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కాంలో తాజాగా పట్టుబడినట్లు చెబుతున్న రూ.11 కోట్లు స్వాధీనం విషయంలో సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ సొమ్ముకు, లిక్కర్ స్కాంకు సంబంధాన్ని చూపించడంలో సిట్ అధికారులు పంచనామా రికార్డులో సరైన ప్రొసీజర్స్ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.లేని స్కాంలో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్లో సిట్ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు సంబంధించి కరెన్సీ నెంబర్లను రికార్డు చేయాలని, ఆ డబ్బును బ్యాంక్లో మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలంటూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో సిట్ అధికారుల్లో కలవరం మొదలైందని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే..హైదరాబాద్లోని సులోచనా ఫార్మ్ ఫాంహౌస్లో 2024 జూన్లో రాజ్ కసిరెడ్డి దాచిపెట్టిన లిక్కర్ స్కాంకు సంబంధించిన పదకొండు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లుగా సిట్ అధికారులు ప్రకటించారు. పట్టుబడిన నగదును కోర్ట్కు సమర్పించారు. సిట్ ఆరోపణలపై ఈ కేసులో నిందితుడుగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఈ సొమ్ము తనకు చెందినది కాదని న్యాయస్థానానికి స్పష్టం చేశారు.సదరు ఫాం హౌస్ యజమానులుగా ఉన్న తీగల విజయేందర్రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీలు, దేశ వ్యాప్తంగా డయాగ్నసిస్ సెంటర్లు, హాస్పటల్స్ ఉన్నాయి. వారికి వందల కోట్ల రూపాయల టర్నోవర్ చేసే వ్యాపారాలు ఉన్నాయి. వారు తనకు బినామీలు అని సిట్ ఆరోపించడం అన్యాయమంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నలబై అయిదేళ్ళకు పైగా వారు వ్యాపారాలు నిర్వహిస్తుంటే, నలబై ఏళ్ళ వయస్సు ఉన్న నాకు వారు బినామీలు అని చెప్పడం ఎంత వరకు సమంజసమని రాజ్ కసిరెడ్డి ప్రశ్నించారు. వారి ఆస్తులను కూడా నావిగా చిత్రీకరించడం బాధాకరణమని తన ఆవేదనను న్యాయస్థానం ముందుంచారు.సిట్ బృందం నిబంధనలను పాటించలేదు:హైదరాబాద్లో పట్టుబడిన రూ.11 కోట్లు కూడా వరుణ్కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నామని సిట్ అధికారులు చెబుతున్నారు. లిక్కర్ స్కాంపై 23.9.2024న ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. వరుణ్ కుమార్ అనే వ్యక్తిపై 21.12.2024న కేసు నమోదు చేశారు. విట్నెస్ కింద నోటీస్ ఇచ్చి వాగ్మూలం నమోదు చేశారు. దీనినే కోర్ట్కు సమర్పించారు. దీనిలో తీగల విజయేందర్రెడ్డి, తీగల బాల్ రెడ్డిని కూడా 17.4.2025న సాక్షులుగా పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ రోజు విచారించిన దర్యాప్తు అధికారులే నేటికీ సిట్లో కొనసాగుతున్నారు. ఆనాడు విచారణ సందర్భంగా ఈ డబ్బు విషయం ఎక్కడా సిట్ రికార్డుల్లో ప్రస్తావించలేదు.అదే దర్యాప్తు అధికారి వరుణ్ కుమార్ను విచారిస్తే ఈ సొమ్ము బయటపడిందని తాజాగా చెప్పడం వెనుక కుట్ర కోణం ఉంది. గతంలో అదే వ్యక్తులను విచారించినప్పుడు ఈ డబ్బు ప్రస్తావన ఎందుకు రాలేదు.? హటాత్తుగా రాజ్ కసిరెడ్డి బెయిల్ విచారణ దశలో ఉండగా ఎలా బయటపడింది? పద్నాలుగు ఏ4 కాగితాలు పెట్టే బాక్స్ల్లో కొత్త కొత్త నోట్లతో ఈ సొమ్ము దొరికింది. ఏసీబీ కేసుల్లో ఎవరినైనా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సందర్భాల్లో ప్రతి నోట్పైనా ఉన్న నెంబర్ను రికార్డు చేస్తారు.వాటిని కోర్ట్కు సమర్పిస్తారు. కానీ ఈ కేసులో పట్టుబడిన పదకొండు కోట్ల రూపాయలకు చెందిన కరెన్సీ నోట్ నెంబర్లను ఎందుకు నోట్ చేయలేదు? వీడియో ఫుటేజీని ఎందుకు రికార్డు చేయలేదు? అలాగే సులోచనా ఫార్మ్ ఫాంహౌస్లో 2024 నుంచి సిసి కెమేరా ఫుటేజీని ఎందుకు సేకరించలేదు? దీనిపైన ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసులో నిందితులకు బెయిల్ రానివ్వకుండా చేయడానికి చేస్తున్న కుట్ర అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆ కరెన్సీ విషయంలో సిట్ ఎందుకు కంగారు పడుతోంది..?విజయేందర్ రెడ్డిని బెదిరించి వారికి చెందిన వ్యాపార సంస్థల నుంచి తెచ్చిన డబ్బును పట్టుకున్నారా లేక ప్రభుత్వమే ఒక ప్లాన్ ప్రకారం ఆ సొమ్మును సమకూర్చి కేసును పక్కదోవ పట్టిస్తోందా? అనే అనుమానాలు ఉన్నాయి. రాజ్ కసిరెడ్డి కోర్ట్లో మాట్లాడుతూ ఆ పదకొండు కోట్లు నేనే నా చేతితో ఇచ్చాను అని చెబుతున్నారు. ఆ సొమ్ముకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ను రికార్డు చేయండి. ఆ కరెన్సీ ఏ సమయంలో ఆర్బీఐ ముద్రించారో దాని నెంబర్లపై దర్యాప్తు చేయించాలని కోర్టుకు విన్నవించారు. దీనిపై కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.ప్రతి కరెన్సీ నోట్ను గుర్తించి పంచనామా నివేదికలో రికార్డు చేయాలని ఆదేశించింది. బ్యాంకుకు జమ చేసి ఉంటే, మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలని కూడా ఆదేశించింది. బ్యాంక్ వద్ద పోలీసులు రాత్రి నుంచే భారీ బందోబస్త్ను ఏర్పాటు చేశారు. రాత్రే బ్యాంకుకు జమ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ కరెన్సీపై విచారణ జరిగితే నిజాలు బయటకు వస్తాయని సిట్ అధికారులు కంగారు పడుతున్నారా? వాటి విషయంలో సిట్ బృందం వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. -
వైఎస్సార్సీపీ నేత అశోక్బాబుకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి అశోక్బాబును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అశోక్పై పోలీసుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు అండగా నిలిచిన అశోక్పై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే.రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశోక్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. రైతుల తరుపున పోరాడుతూ, వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు అశోక్ ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అణిచివేయాలని చూశారు. రైతాంగానికి మంచి జరిగే కార్యక్రమం అశోక్ చేయడం అభినందనీయం. ఆయనపై పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం. రైతులకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అశోక్బాబుకు అన్నివిధాలా పార్టీ అండగా నిలుస్తుంది’’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.కాగా, సాగునీటి కాలువలు బాగుచేసి రైతులను ఆదుకోవాలంటూ బాపట్ల జిల్లా రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద వరికూటి చేపట్టిన దీక్షను అడ్డుకునే నెపంతో ఆయనపై పోలీసులు దాడి చేశారు. కూటమి నేతల సూచన మేరకు.. స్టేషన్కు తరలిస్తున్నట్లు నటించి పిడిగుద్దులతో ఆయనను కుళ్లబొడిచారు. పోలీసుల దాడితో ఆయన రేపల్లె పట్టణ పోలీసు స్టేషన్లో స్పృహ తప్పి పడిపోయారు.వేమూరు, రేపల్లె నియోజకవర్గంలో సాగునీటి కాలువలు పూడికతో నిండిపోయి పంట పొలాలకు నీరు సక్రమంగా రావడం లేదు. రైతుల కష్టాలు చూసిన వరికూటి అశోక్బాబు కాలువల్లోకి దిగి ప్రత్యక్ష ఆందోళనతో నిరసన తెలిపి, సమస్యను ప్రభుత్వం దృíష్టికి తెచ్చారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో శుక్రవారం ఉదయం రేపల్లెలో అధికారులను కలిసి సమస్య పరిష్కరించాలని కోరేందుకు వెళ్లారు.అయితే అధికారులు అందుబాటులో లేక పోవడంతో సాయంత్రంలోగా తనకు స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. సాయంత్రం వరకు చూసినా అధికారులు ఎటువంటి హామీ ఇవ్వక పోవడంతో ఆయన ఆమరణ దీక్షకు సిద్ధపడ్డారు. ఇంతలో రేపల్లె పట్టణ సీఐ మల్లిఖార్జునరావు పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని వరికూటితో వాగ్వాదానికి దిగారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదని తక్షణం వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పది మంది పోలీసులు అశోక్బాబును చుట్టుముట్టి.. పిడిగుద్దులు గుద్దుతూ పోలీసు స్టేషన్ వరకు మోసుకెళ్లారు. -
బ్యాంక్ నుంచి ఆ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారు?: పొన్నవోలు
సాక్షి, విజయవాడ: రూ.11 కోట్ల విషయంలో సిట్ కుట్రలు చేస్తోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి(లీగల్) పొన్నవోలు సుధాకర్రెడ్డి మండిపడ్డారు. సీరియల్ నంబర్స్ వీడియోగ్రఫి చేయాలని కోర్టు ఆదేశించినా కానీ.. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి బ్యాంకులో డిపాజిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బ్యాంక్ నుంచి ఆ డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారంటూ ఆయన ప్రశ్నించారు. నోట్లు వెరిఫై చేస్తే ఎవరు విత్ డ్రా చేశారో తెలుస్తుందని పొన్నవోలు సుధాకర్రెడ్డి పేర్కొన్నారు.కాగా, ఏసీబీ కోర్టులో రాజ్ కేసిరెడ్డి న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. రూ.11 కోట్లు రూపాయలు సీరియల్ నెంబర్లు వీడియో గ్రఫి చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు. రూ.11 కోట్లు ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి సిట్ సన్నాహాలు చేస్తుండగా.. రూ. 11 కోట్లను కచ్చితంగా కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియో గ్రఫి చేయాలని పిటిషన్లో పేర్కొన్న న్యాయవాది.. సిట్ తొందరపాటు చర్యలకు పాల్పడుతుందన్నారు. -
అక్కడ ఎంపీటీసీ ఎన్నిక వాయిదా వేయాలి.. ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: ఏపీలో రామకుప్పం ఎంపీటీసీ ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నారాయణ మూర్తి వినతి పత్నం అందజేశారు.అనంతరం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ..‘రెండు జడ్పీటీసీ, మూడు ఎంపీటీసీలకు నోటిఫికేషన్ ఇచ్చారు. నామినేషన్ల స్క్రూట్నీ జరుగుతోంది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేస్తున్నాడు. మహిళలపై గౌరవం ఉన్నట్లు పదేపదే మాట్లాడతారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే దళిత మహిళ నామినేషన్ను అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను లాక్కుంటుంటే పోలీసులు కనీసం అడ్డుకోలేకపోయారు. స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే తీసుకోవడం లేదు. ఇక బాధితులు ఎవరికి చెప్పుకోవాలి. ప్రజాస్వామ్య విలువలు లేవు. కేసులు తీసుకునే పరిస్థితులు లేవు. కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ మెట్లు ఎక్కుతూ దిగుతున్నాం. ఎన్నికల కమిషన్ తన విస్తృతమైన అధికారాలు వినియోగించాలి. మేం ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకూ సీసీ కెమెరాలు పర్యవేక్షణ చేయాలన్నాం. ఆన్ లైన్ నామినేషన్లు స్వీకరణకు అనుమతించాలని కోరాం.బీహార్ తరహా పరస్థితులు ఏపీలో నెలకొన్నాయి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు. లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. పార్టీలు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అధికారులు శాశ్వతం. అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తే వారికి ఇదే మా హెచ్చరిక. మేమూ డిజిటల్ లైబ్రరీ పెట్టాం. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వారి పేర్లు డిజిటల్ లైబ్రరీలో చేర్చుతున్నాం. మేం అధికారంలోకి వచ్చాక వారందరినీ చట్టం ముందు నిలబెడతాం. రామకుప్పం ఎంపీటీసీ ఎన్నిక వాయిదా వేయాలి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరపాలి. లేకపోతే న్యాయపోరాటం చేస్తాం’ అని తెలిపారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘స్థానిక సంస్థలు జరిగే చోట జాగ్రత్తలు తీసుకోవాలని గతంలోనే మేం కోరాం. ఈ ప్రభుత్వం సజావుగా ఎన్నికలు జరిపించేలా లేదని మేం ముందుగానే చెప్పాం. రామకుప్పం ఎంపీటీసీ అభ్యర్ధి, దళిత మహిళ శ్రీదేవిని నామినేషన్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆమె వద్ద బ్యాగ్ లాక్కున్నారు. విలువైన డాక్యుమెంట్లు, నామినేషన్ పత్రాలు లాక్కున్నారు. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. రాష్ట్రంలో రూల్స్ ప్రకారం పాలన సాగడం లేదు. సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అమలు కావడం లేదన్నారు.దళితులు, మహిళలకు భద్రత ఏది?. దౌర్జన్యం జరుగుతున్నా పోలీసులు కళ్లప్పగించి చూడటం తప్పు. ఫిర్యాదును కూడా పోలీసులు తీసుకోలేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా తీసుకునే పరిస్థితి లేకపోతే ఎలా?. ఏపీలో ఎమర్జన్సీ పాలన జరుగుతోంది. దళిత మహిళపై జరిగిన దాడికి ప్రభుత్వం.. చంద్రబాబు సమాధానం చెప్పాలి. రామకుప్పం ఎన్నికను వాయిదా వేయాలి. ఎన్నికల కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఎన్నిక వాయిదా వేయకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు.మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..‘ఎస్సీ మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తేనే భయపడుతున్నారు. ఎందుకు అంత భయం. ఏడాది కాలంలోనే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇంత దారుణమా?. దీనికి సీఎం ఏం సమాధానం చెబుతారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. ఏదో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రామకుప్పం ఎంపీటీసీ ఎన్నిక వాయిదా వేయాలి. శ్రీదేవి నామినేషన్ స్వీకరించాలి. లేకపోతే పోరాటం ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు. -
నేనున్నంత వరకు రైతుకు భరోసా లేదు: చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనసులో మాట బయటపెట్టారు. తాను ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. పైగా ఇది నా ప్రామిస్ అంటూ నొక్కి మరీ చెప్పారు.‘‘చంద్రన్న ఉన్నంత వరకు రైతు భరోసా లేదు.. ఉండదు.. రాబోదు’’ అంటూ చంద్రబాబే వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు అర్థమైన రైతులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. బాబు నిజస్వరూపం బయటపెట్టారంటూ చర్చ మొదలు పెట్టారు. శనివారం ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో జరిగిన అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే టంగ్ స్లిప్ అయ్యారో ఏమోగానీ.. తన మనసులో మాటే ఆయన బయటపెట్టారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.చంద్రబాబు ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదు .. ఉండదు.. ఉండబోదు🤣🤣#ChandraBabu #ChandraBabuFailedCM #APNotInSafeHands #AndhraPradesh pic.twitter.com/qcbRpArzju— Jaganaithene Chesthadu (@Jaganaithene) August 2, 2025 -
‘కూటమి వెన్నుపోటు.. అన్నదాత సుఖీభవలో మరో మోసం’
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో వెన్నుపోటు రాజకీయానికి తెర తీసిందన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రాష్ట్రంలో ఏడు లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఎగొట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచి 20 వేలకు మాత్రమే పరిమితం చేసిందని విమర్శలు చేశారు.మాజీ మంత్రి కారుమూరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అన్నదాత సుఖీభవలో కూటమి మరో మోసం చేస్తోంది. 26వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టి.. ఎన్నికలైన 14 నెలల తర్వాత ప్రజలను మోసం చేసే కార్యక్రమం ప్రారంభించారు. 10,716 కోట్లు గత ఏడాది రైతులకు ఎగొట్టారు. ఏడు లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వడం లేదు. దర్శిలో సినిమా సెట్టింగ్ వేసి మంచాలకు కూడా పచ్చ రంగు వేసి ఈ కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం మరో వెన్నుపోటు రాజకీయానికి తెర తీసింది.రైతులను నట్టేట ముంచి 20వేలకు మాత్రమే పరిమితం చేసింది. ఐదేళ్లలో వైఎస్ జగన్ రైతులకు 67,500 అందించారు. తల్లికి వందనం కోతలు లేకుండా ఇస్తామని చెప్పి 13వేలు ఇచ్చారు. అందులో కూడా లక్షలాది మందికి పంగనామం పెట్టారు. రైతు గురించి పూర్తిగా ఆలోచించడం మానేశారు. రైతులను పూర్తిగా గాలికి వదిలేశారు. 5,500 రూపాయలకు కోకో పంట టన్నుకు ఇప్పిస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు రైతులను దారుణంగా మోసం చేశారు. మామిడికాయ కిలోకు 19 రూపాయలు ఇస్తామని చెప్పి రెండు రూపాయలకు పరిమితం చేశారు. రైతులు అన్యాయం అయిపోయారు.మిర్చి రైతుల గురించి కేంద్రానికి లేఖ రాసి మమ అనిపించారు. పొగాకు రైతుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. 24 గంటల్లో డబ్బులు వేస్తామన్నారు. మూడు నెలలకు కూడా డబ్బులు వేయలేదు. వైఎస్ జగన్ హయాంలో సున్నా వడ్డీతో రుణాలు ఇప్పించారు. రైతు పంట పండించకపోతే ఏ ప్రజాప్రతినిధి మనుగడ సాధించలేరు. వ్యవసాయం అవసరం లేకపోతే మీరు ఆకలికి ట్యాబ్లెట్ కనిపెట్టండి. గతేడాది అన్నదాత సుఖీభవ సొమ్ముతో కలిపి లబ్ధిదారులకు చెల్లించాలి. రోజుకు 450 కోట్లు అప్పు చేస్తూ రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు అని విమర్శలు చేశారు. -
పదవులొచ్చాయి.. పరువు పోయింది
ఎలా ఉండేవాళ్ళు ఎలా అయ్యారు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నపుడు వేమిరెడ్డి ప్రభాకర్ దంపతులు ఎంతో గౌరవంతో ఉండేవారు.. ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉండగా ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా ఉంటూ దేశంలోని పలుచోట్ల శ్రీవారి ఆలయాల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.. ఇంటా బయటా గౌరవం.. గుర్తింపుతో ఉండేవారు.నాడు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే ఒక జంటిల్మెన్ అనే ట్యాగ్ లైన్తో ఉండేవారు.. వైఎస్ జగన్తో పాటు పార్టీ నేతలు.. సభ్యులు.. సహచర ఎంపీలు.. ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ప్రభాకర్ రెడ్డికి ఎనలేని గౌరవం ఇచ్చేవాళ్ళు. ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఆయన టీడీపీలో చేరి నెల్లూరు నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. భార్య ప్రశాంతి రెడ్డి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంట్లో భార్యాభర్తలకు రెండు పదవులు రావడం వరకూ సంతోషమే కానీ.. పదవులు రావడం.. వారికి ఇది వరకు సమాజంలో ఉన్న గౌరవం పోవడం ఒకేసారి జరిగిపోయింది.పదవులు వచ్చినంత త్వరగా గౌరవమర్యాదలు పోవడం మొదలైంది. సంపన్నులైన వేమిరెడ్డి దంపతులు ప్రజా జీవితంలో ఉంటే తమకు మంచి లాభం అని భావించిన టీడీపీ జనసేన నేతలు వారు గెలవగానే ఇప్పుడు నిజరూపం చూపిస్తున్నారు. ప్రశాంతి పేరు చెప్పి టీడీపీ జనసేన నేతలు కోవూరులో రౌడీయిజం చేయడం మొదలెట్టారు. ఎక్కడికక్కడ దందాలు.. సెటిల్మెంట్లు.. గూండాగిరితో సమాజాన్ని హడలెత్తిస్తున్నారు. అంతేకాకుండా సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిమీద దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేయడం వాళ్లకు వాళ్ళు సమర్థించుకున్నా కానీ వేమిరెడ్డి ఫ్యామిలీకి బాగా డ్యామేజ్ చేసింది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అంత మాత్రానికే ఇంటి మీదకు వెళ్లి రౌడీయిజం చేయడమా అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఇసుక.. మద్యం.. గ్రావెల్ అంటూ ఆమె అనుచరులు దందా చేస్తూ జనాన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.దీంతోబాటు నెల్లూరులో క్వార్ట్జ్ ఖనిజం పేరిట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీలు చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. దేశ విదేశాలకు లక్షల టన్నుల ఖనిజం ఎగుమతి చేయడం.. ఇందులో చాలావరకు అక్రమంగా తవ్వింది ఉందని తేటతెల్లం అవడంతో ఆయన సైతం సమాధానం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రభాకర్ రెడ్డికి చెందిన మైనింగ్ కంపెనీలు అడ్డగోలుగా ఖనిజాలు తవ్వేస్తూ వనరులను కొల్లగొడుతున్నట్లు ప్రభుత్వం వద్ద కూడా రికార్డులు ఉన్నాయి. పైగా మైనింగ్ శాఖ కూడా లోలోన ఇదే రిపోర్ట్ పంపింది. మొత్తానికి డబ్బు.. పదవి వచ్చినంత వేగంగా వేమిరెడ్డి పరపతి దిగజారిపోయింది.ఇక జనంలో విమర్శలు.. వైఎస్సార్సీపీ నాయకుల పోరాటాలు చూసి వేమిరెడ్డి ఏమనుకున్నారో ఏమో ఇక తానూ మైనింగ్ వ్యాపారం నిలిపివేస్తాను అని ప్రకటించారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు ముందురోజే ఆయన మీడియాతో మాట్లాడుతూ తానింకా వ్యాపారం చేయలేనని అన్నారు. వ్యాపారాలు మూసేస్తున్నానని ప్రకటించారు. గౌరవం సైతం చిల్లుకుండలోని నీరులా రోజురోజుకూ తగ్గిపోతోంది.. గతంలో గౌరవంగా ఉండే వేమిరెడ్డి కుటుంబం ఇప్పుడు పరువు.. పరపతి కోల్పోయి అవమానకర పరిస్థితుల్లో పదవుల్లో కొనసాగుతున్నారని నెల్లూరు జనం చెప్పుకుంటున్నారు..-సిమ్మాదిరప్పన్న. -
‘అందుకే 30 ఏళ్లలో 58సార్లు సింగపూర్కు చంద్రబాబు’
చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అమర్నాథ్ అన్నారాయన. శనివారం ఉదయం విశాఖపట్నంలో అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు. అక్కడికి వెళ్లి సాధించింది ఏంటో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని అన్నారాయన. శనివారం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు 30 ఏళ్లలో 58 సార్లు సింగపూర్కు వెళ్లారు. అక్రమంగా సంపాదించిందంతా దాచుకోవడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. అందుకే ఆయన అక్కడికి వెళ్లి సాధించింది ఏమిటో చెప్పుకోలేకపోతున్నారు.... ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమిటి?. సాధించింది ఏమీ లేకే వైఎస్ జగన్పై విమర్శలు చేస్తున్నారు. అదానీ డేటా సెంటర్ గురించి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అది ఏర్పాటైంది వైఎస్సార్సీపీ హయాం. సముద్ర జలాలు ఉపయోగించుకోవాలని చంద్రబాబు, లోకేష్లకు ఎప్పుడైనా అనిపించిందా?. లోకేష్ చెబుతున్న బ్లూ ఎకానమీకి అంకురార్పణ జరిగింది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే. కేవలం ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ ప్రధానమైన మూడు పోర్టులను పూర్తి చేశారు.... భూములను ఉద్యోగాలు కల్పించే నాణ్యమైన కంపెనీలకు అప్పగిస్తే ఫర్వాలేదు. కానీ, విశాఖలో విలువైన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెట్టారు. 99 పైసల చొప్పున.. రూ.1,350 కోట్ల విలువైన భూమిని అప్పన్నంగా అప్పగించారు. లులు సంస్థకు కారుచౌకగా భూములను, ఉర్సాకు 60 ఎకరాల భూమి ఇచ్చారు. ఎక్కడా పారదర్శకత లేకుండా భూములు కేటాయించారు. కంచె చేను మేసినట్లుగా ఉంది ఈ ప్రభుత్వ పరిస్థితి’’ అని అమర్నాథ్ మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ యాప్తో పోలీసు జులుంకు చెక్!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరికొత్త ప్రయోగానికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అరాచకాలు, ప్రత్యేకించి పోలీసుల ఆగడాలను ఎదుర్కొనేందుకు పార్టీ తరఫున ప్రత్యేక యాప్ తయారీకి సిద్ధమయ్యారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ యాప్ సాయంతో తమపై జరుగుతున్న అకృత్యాలను, ఇబ్బంది పెడుతున్న పోలీసు, ఇతర శాఖల అధికారుల గురించి చెప్పుకోవచ్చు. వారికి జరిగిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలు కూడా అందులో అప్లోడ్ చేయవచ్చు. ఈ ఫిర్యాదులన్నీ పార్టీ డిజిటల్ లైబ్రరీ సర్వర్లో భద్రంగా ఉంటాయి. 2029 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఆ ఫిర్యాదుల ఆధారంగా ఆయా అధికారులపై చట్టపరంగా చర్య తీసుకుంటామని జగన్ విస్పష్టంగా ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన రాజకీయ సలహా మండలి సమావేశంలో జగన్ ఈ యాప్ గురించి తెలిపారు. అయితే.. ఆ పార్టీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టికాలు, మోపుతున్న తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు ఇప్పటివరకూ లీగల్సాయం మాత్రం అందిస్తోంది. కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలకు జగన్ స్వయంగా భరోసానిస్తున్నారు. జైల్లో ఉన్న నేతలను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు. నిన్నటికి నిన్న.. నెల్లూరు వెళ్లినప్పుడు.. అంతకుముందు పొదిలి, సత్తెనపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు రకరకాల ఆంక్షలు, నిర్బంధాలు పెట్టిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వాటిని నేరుగా యాప్లోనే నమోదు చేసుకునే అవకాశం వస్తుందని అంచనా. తద్వారా ఇలాంటి ఘటనలన్ని సమగ్రంగా అందుబాటులో ఉంటాయన్నమాట. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో హింస విచ్చలవిడిగా జరుగుతోంది. అధికార పార్టీ నేతలే గూండాయిజానికి బరి తెగిస్తున్నారు. పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతల ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఒకవేళ పిర్యాదు తీసుకున్నా కేసులు కట్టడం, కూటమి నేతలు ముఖ్యంగా టీడీపీ వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నది వైఎస్సార్సీపీ ఆవేదన. తన కుటుంబంపై అసభ్యకర పోస్టింగ్లు పెట్టిన వారి మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. అయితే ఆయన పట్టువదలని విక్రమార్కుడు మాదిరి పోరాడితే కొన్నింటిని నమోదు చేశారు. అదే టీడీపీ ఫిర్యాదులకు మాత్రం వాయు వేగంతో స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లనివ్వకుండా మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుపడుతుంటే, కట్టడి చేయాల్సిన పోలీసులు పట్టించుకోవడం మానేశారు. తాడిపత్రి వెళ్లవద్దని పెద్దారెడ్డికి చెబుతూ అడ్డుకుంటున్నారు. కోర్టు ఆదేశాలు కూడా ఖాతరు చేయడం లేదు. మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ తురగా కిషోర్పై పలు కేసులు పెట్టి ఏడు నెలలుగా వేధిస్తూనే ఉన్నారు. పద్నాలుగు కేసులలో బెయిల్ తీసుకుని బయటకు వస్తే మళ్లీ కొత్త కేసు పెట్టి తీసుకుపోయారు. ఇదేమి ప్రభుత్వం అంటూ కిషోర్ భార్య రోదించినా కూటమి సర్కార్కు కనికరం కలగలేదు. సోషల్ మీడియా కార్యకర్తలు అనేక మంది ఏపీ పోలీసుల నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఒక కార్యకర్త పోలీసులు తన చేతులకు ఎలా బేడీలు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి వందల కిలోమీటర్లు తిప్పింది ఫేస్బుక్లో వివరిస్తే, అది చదివిన వారి కళ్లు చెమర్చాయి. తప్పు చేస్తే పోలీసులు ఎవరిపైనైనా కేసులు పెట్టవచ్చు. కాని అచ్చంగా టీడీపీ వారి కోసమే పోలీసు వ్యవస్థ అన్నట్లు పని చేయడమే దుర్మార్గం. రాజకీయ సలహామండలి సమావేశంలో జగన్ మద్యం కేసును కూడా ప్రస్తావించి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి వారిని కూడా అక్రమంగా జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఒకటికాదు.. అనేక కేసులలో వైఎస్సార్సీపీ కేడర్ను, నేతలను వేధిస్తున్న పోలీసు అధికారుల గురించి యాప్లో ప్రస్తావించే అవకాశం ఉండవచ్చు. ఈ యాప్ తెస్తున్నారని తెలిసిన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులకు ఒక విధమైన నమ్మకం కలిగింది. ఈ యాప్ పనిచేయడం ఆరంభిస్తే మరీ అతిగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు కూడా కొంత నిగ్రహం పాటించవచ్చునన్న భావన ఏర్పడుతోంది. పోలీసులు అందరూ ఇలా ఉన్నారని కాదుకాని కొందరు మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారన్నది వైఎస్సార్సీపీ ఫిర్యాదు. అలాంటి వారి వివరాలు యాప్లో నమోదు చేస్తే అప్పుడు సంబంధిత అధికారులు కాస్త జాగ్రత్తగా మసులుకునే అవకాశం ఉండవచ్చు. అదే సమయంలో యాప్లో ఫిర్యాదు చేస్తారా అని టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులు ఎవరైనా మరింత రెచ్చిపోతారా? అన్నది కూడా చూడాలి. వైఎస్సార్సీపీ యాప్ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్లు ఎలా స్పందిస్తారన్నది చెప్పలేం. 2029లో కూటమి అధికారం కోల్పోయి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే వారు కూడా ఇవే తరహా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు అన్నది ఎక్కువ మంది విశ్లేషణ. ఏపీ పోలీసుల తీరుపై హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలో తీవ్రంగానే స్పందిస్తోంది. తాజాగా ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు స్పందిస్తూ తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో తమకు కూడా బాగా తెలుసునని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో పోలీసు వర్గాలలో కొంత మార్పు వచ్చినట్లు కనబడుతున్నా, పైనుంచి వచ్చే ఒత్తిడిని భరించలేక కొందరు అధికారులు వైసీపీ వారిపై వేధింపుల పర్వం కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. చట్టం ప్రకారం వ్యవహరిస్తే ఫర్వాలేదు. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ మద్దతుదారులను వేధిస్తే, తర్వాత కాలంలో వారు కూడా ఇబ్బంది పడతారని చెప్పడానికి ఈ యాప్ ఉపయోగపడవచ్చు. అంతేకాక వీరి ప్రవర్తనకు సంబంధించి వైఎస్సార్సీపీ యాప్లో నమోదైతే ఆ అధికారులకు కూడా అప్రతిష్టే. ఏది ఏమైనా ఎర్రబుక్ పేరుతో టీడీపీ నేతలు, కేడర్ చేస్తున్న అరాచకాలకు ఈ యాప్ గట్టి జవాబు ఇవ్వవచ్చని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ఇకనైనా ఏపీలో పరిస్థితులు మారతాయా? చూద్దాం!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
చిన్ని Vs కొలికిపూడి.. టీడీపీలో కోల్డ్ వార్!
సాక్షి, ఎన్టీఆర్: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో అక్రమ ఇసుక రవాణా పీక్ స్టేజ్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో తిరువూరు టీడీపీలో ఇసుక పంచాయతీ మళ్లీ రచ్చకెక్కింది. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు బెదిరింపులకు దిగడం గమనార్హం.వివరాల ప్రకారం.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుల కనుసన్నల్లో ఇసుక అక్రమంగా ఏపీ బోర్డర్ దాటేస్తోంది. అనంతరం, ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు గ్రామం పెద్దవరం వద్ద ఇసుక డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి తెలంగాణకు ఇసుక తరలించి ఎంపీ అనుచరులు సొమ్ము చేసుకుంటున్నారు. ఎంపీ మనుషులు గండ్ర హరినాథ్, నన్నపనేని సాయికృష్ణ పగలూ రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తమ వెనుక ఎంపీ ముఖ్య అనుచరుడు మాదాల హరిచరణ్ కిట్టు ఉన్నాడంటూ వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో, అక్రమ ఇసుక వ్యవహారం స్థానికంగా హాట్టాపిక్గా మారింది.మరోవైపు.. పెద్దవరంలో నిల్వచేసిన ఇసుక డంపింగ్లను గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందన్నారు. పోలీసులే దగ్గరుండి సెటిల్ మెంట్లు చేస్తున్నారని ఆరోపించారురు. అందుకే బోర్డర్లో సీసీ కెమెరాలు పెట్టలేదన్నారు. ఈ క్రమంలో ఏసీపీతో ఫోన్లో మాట్లాడిన కొలికపూడి.. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో తిరువూరుకు చెందిన గంజాయి బ్యాచ్కు ఇసుక అక్రమ రవాణాకు సంబంధం ఉందన్నారు. ఆ గంజాయి బ్యాచ్కు పోలీసులు సహకరిస్తున్నారు. ఒకే వ్యక్తి పేరుతో ఇసుక బుకింగ్స్ జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. -
అశోక్బాబుపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించిన వైయస్సార్సీపీ
తాడేపల్లి: వైయస్సార్సీపీ దళిత నేత వరికూటి అశోక్బాబుపై రేపల్లె పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. ఈ తరహా చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధం.బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో కాలువలన్నీ గుర్రపుడెక్కతో నిండిపోయి, సాగు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ, అక్కడి మా పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ఆందోళన చేస్తే, రేపల్లె పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అత్యంత హేయం. రైతుల మేలు కోసం రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం వద్ద బైఠాయించి అశోక్ బాబు ధర్నా చేస్తే, ఆయన పట్ల స్థానిక పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. కాళ్లు, చేతులు పట్టుకుని బలవంతంగా లాక్కెళ్లడంతో నడుం పట్టిన ఆయన ఇప్పుడు తీవ్ర అవస్థ పడుతున్నారు.రైతుల మేలు కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా, అంత దౌర్జన్యంగా ప్రవర్తించడం ఎంత వరకు సబబు..? అశోక్బాబును దారుణంగా పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లడంతో, ఆయన నడుం పట్టేసింది. దీంతో ఆయన లేవలేకపోతున్నారు. కనీసం కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. రేపల్లెలో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకనైనా వారు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం అంటూ వైయస్సార్సీపీ నాయకులు మేరుగ నాగార్జున, టీజేఆర్ సుధాకర్బాబు, జూపూడి ప్రభాకర్రావు పేర్కొన్నారు. -
జనసేన ఎమ్మెల్యే అవినీతిపై.. టీడీపీ నేతల ఫోన్కాల్ సంభాషణ వైరల్
సాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబుల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది.ఇరువురి సంభాషణలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అవినీతిపై చర్చకు వచ్చింది. ఈ చర్చలో ఏడాదిలోనే రూ.100 కోట్లు దోచేశారని దేవినేని ఉమా ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇవన్నీ తెలుసా? అని రాంబాబును ఉమ ప్రశ్నించారు. అందుకు రాంబాబు స్పందిస్తూ .. ఇప్పటివరకు పవన్ నాకు ఫోన్ చేయలేదని అన్నారు. -
‘ మేం నిరూపిస్తే.. మీరు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?’
విశాఖ: తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నెల్లూరు పర్యటన విజయవంతం కావడంతో కూటమి నేతలు అనిత, ప్రశాంత రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. ‘జనాలు రాలేదని అనిత మాట్లాడుతున్నారు. జనాలు వచ్చినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి అనిత రాజీనామా చేస్తారా?, జగన్ కాలు గోటికి అనితా సరిపోదు. సంస్కారహీనురాలు, మానసిక రోగి అనిత. జగన్ పర్యటనకు జనాలు రాకుండా 3 వేల మంది పోలీసులను పెట్టారు. రోడ్లు మీద గుంతలు తవ్వి, ఇనుప కంచెలు పెట్టారు. అయినా జనాలను రాకుండా అడ్డుకోలేక పోయారు.అనితా తన పదవిని నిలబెట్టుకోవడం కోసం జగన్ పై విమర్శలు చేస్తున్నారు. అనితా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. అసమర్థ హోమ్ మంత్రి అనిత అని పవన్ కళ్యాణ్ చెప్పారు’ అని వరుదు కళ్యాణి కౌంటరిచ్చారు. -
‘జగన్ని ఆపడం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదు’
తాడేపల్లి : తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళితే టీడీపీ నేతలు వణికిపోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. రోడ్లు తవ్వి, ముళ్ల కంచెలు వేసి నానా హంగామా చేసినా జగన్ పర్యటన విజయవంతమైందన్నారు. అసలు ఒక పార్టీ అధినేత పర్యటనలకు వెళితే ఆంక్షలు ఎందుకు? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 1వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి.. ‘ వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి ఇబ్బందులు పెడుతున్నారు. ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్టి త్రిపాఠి నెల్లూరులోనే కూర్చొని జనం రాకుండా చేయాలని చూశారు. జగన్ కోసం జనం తండోపతండాలుగా వస్తున్నారు’ అని పేర్కొన్నారు.సింగపూర్కు వెళ్లి ఏమి సాధించారు?ఇప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 55సార్లు సింగపూర్కు ఎళ్లారని, మరి రాష్ట్రానికి ఏమి పెట్టుబడులు తెచ్చారో ఇప్పటివరకూ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు అంబటి. తప్పుడు పనులు చేసి జైలుకు వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ని పరామర్శించటానికే వెళ్లారని ఎద్దేవా చేశారు. సింగపూర్కు వెళ్లి ఏమీ సాధించలేకపోవడంతో అది కూడా మా పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఏపీలో పెట్టుబడి పెట్టేది లేదని సింగపూర్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దానికి కారణం వైఎస్సార్సీపీ నేతలంటూ ఆరోపణలు చేస్తున్నారు. మురళీకృష్ణచౌదరి అనే టీడీపీ వ్యక్తే సింగపూర్ ప్రభుత్వానికి ఈ-మెయిల్ చేశారని తేలింది. అతని ఆస్తులను వారి పార్టీ నేతలే కబ్జా చేశారన్న కారణంతో ఈ-మెయిల్ చేశారట. అలాంటి వ్యక్తిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిగా ఎలా చిత్రీకరిస్తారు?, చంద్రబాబు ప్రభుత్వానికి శని పట్టింది. అందుకే పరిపాలనను వదిలేసి జగన్ పర్యటనను కట్టడి చేసే పనిలో పడ్డారు. ఏం చేసినా జగన్ని ఆపటం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదు. హోంమంత్రి అనిత అదేపనిగా జగన్ని తిట్టటమే పనిగా పెట్టుకుంది. జగన్ని తిడితే మంత్రి పదవి ఉంటుందని ఆమె భావిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే కొందరు ఐపిఎస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలి. లోకేష్ హైక్యాష్ గా మారిపోయారు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి మా నాయకుడు వెళ్తే టీడీపీకి ఇబ్బంది ఏంటి?, పెట్టుబడులపై చిట్టినాయుడు పిట్టకథలు చెప్తున్నారు. చంద్రబాబు తోకని చిట్టినాయుడు కట్ చేస్తున్నాడు.. చిట్టినాయుడు తోకని జనం కట్ చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేయటమే చంద్రబాబు లక్ష్యం. కేసులు పెట్టటానికి ఇప్పుడు మళ్ళీ ఇసుక కేసు అంటున్నారు. చిట్టినాయుడు కథలు రాస్తుంటే పోలీసులు డ్రామా ప్లే చేస్తున్నారు. ఈ కేసులేవీ చట్టం ముందు నిలపడవు’ అని అంబటి పేర్కొన్నారు. -
స్వతంత్ర్య అభ్యర్ధి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన టీడీపీ నేతలు!
చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ ఉప ఎన్నికలు సందర్భంగా నామినేషన్ వేయడానికి వచ్చిన స్వతంత్ర్య అభ్యర్థి పట్ల టీడీపీ నేతలు రౌడీయిజం సృష్టించారు. శ్రీదేవి అనే స్వతంత్య్ర అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడానికి రాగా, ఆమెను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఆమె నామినేషన్ వేయకుండా చేసేందుకు నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిపోయారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన క్రమంలో ఆమెను టీడీపీ నాయకుడు ఆనంద్రెడ్డి తన అనుచరులతో చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలోనే ఆమె వద్దనున్న నామినేషన్ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఓటర్ కార్డు, రూ. 5వేల నగదును ఎత్తుకెళ్లారు. దీనిపై శ్రీదేవి మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి , ఇలా రౌడీయిజం చేసి కాదు. నామినేషన్ పత్రాలను, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఓటర్ కార్డు, 5వేల నగదు ఎత్తుకు వెళ్లారు. ఎస్.ఐ దగ్గర ఉన్నా, మాపై దౌర్జన్యం చేస్తున్నా పట్టించుకోలేదు’ అని ఆమె విమర్శించారు. -
చింతమనేని వర్గం హల్చల్.. అబ్బయ్య చౌదరి హెచ్చరిక
సాక్షి, పశ్చిమ గోదావరి: దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని భయానక వాతావరణ సృష్టించారని అన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. చింతమనేని ప్రభాకర్ బెదిరింపులకు భయపడేవాడెవారు ఎవరూ లేరు.. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే, దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి టార్గెట్గా చింతమనేని రాక్షస క్రీడకు తెరలేపారు. అబ్బయ్య చౌదరికి చెందిన పంట పొలాలను పచ్చ మూకలు ధ్వంసం చేసి.. వక్క చెట్లను నరుక్కు పోయారు. అంతటితో ఆగకుండా.. అబ్బయ్య చౌదరి ఇంటి ముందు టీడీపీ శ్రేణులు వంటావార్పుకి పిలుపునిచ్చారు. దీంతో, దెందులూరు నియోజకవర్గం కొండలరావు పాలెంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అబ్బయ్యచౌదరి నివాసానికి వైఎస్సార్సీపీ శ్రేణులు చేరుకున్నారు. ఈ క్రమంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దెందులూరు నియోజకవర్గంలోకి అబ్బయ్య చౌదరి వచ్చాడంటే చాలు ఉలిక్కిపడుతున్నారు. టీడీపీ నేతలకు అధికారం ఇచ్చింది దేనికి?. ప్రజలకు మంచి చేయడానికా లేక అబ్బయ్య చౌదరిని టార్గెట్ చేయడానికా?. దెందులూరులో వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను టార్గెట్ చేస్తున్నారు. చింతమనేని మేము చేసిన అభివృద్ధిలో సంక్షేమంతో పోటీ పడండి.. అంతేకానీ కక్షపూరిత రాజకీయాలు కాదు.దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని భయానక వాతావరణ సృష్టించారు. చింతమనేని బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరు. తప్పుడు కేసులు పెడితే కోర్టులో మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రావడం లేదు. ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చి భయపెట్టాలని చూస్తున్నారు. మాజీ శాసనసభ్యుడి ఇంటి ముందు ఇలా చేయడం ఏంటి?. మేము ఎక్కడికి పారిపోవటం లేదు ఇక్కడే ఉన్నాం.. ఏం చేస్తారో చేయండి?. దుర్మార్గమైన నీచమైన సంస్కృతికి తెర లేపారు. మా తోటలో వక్క చెట్లు నరుక్కుని పోయే బ్యాచులు తయారయ్యారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
లోకేష్.. అది మీ నాన్నను అడిగి తెలుసుకోండి
హైదరాబాద్, సాక్షి: చంద్రబాబు తనయుడు, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులపై లోకేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలంటించారు.బనకచర్ల కట్టి తీరతామని నారా లోకేష్ అంటున్నారు. మరి లోకేష్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఇంతదాకా స్పందించలేదు. సీఎం, మంత్రులు సహా ఎవరూ ఖండించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును తాము అడ్డుకోలేదని లోకేష్ మాట్లాడుతున్నారు. మీకు తెలియకుంటే మీ నాన్నను అడిగి తెలుసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు మీ నాన్న చంద్రబాబు ఏడు లేఖలు కేంద్రానికి రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 రకాల అనుమతులు ఉన్నాయి. కావాలంటే మీకు అన్ని ఆధారాలు పంపిస్తాం.కేంద్రం, రేవంత్ బలం చూసుకుని లోకేష్ మాట్లాడుతున్నారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీకి నీళ్లు తీసుకెళ్లాలని చూస్తున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా మీ ఆటలు సాగనివ్వం. బనకచర్లను అడ్డుకుని తీరతాం అని హరీష్రావు హెచ్చరికలు జారీ చేశారు. -
‘లిక్కర్ స్కాంలో రోజుకో పిట్ట కథ’
సాక్షి, విజయవాడ: ఏపీలో లిక్కర్ స్కాంలో కూటమి నేతలు రోజుకో పిట్ట కథ చెబుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కాంను తెర మీదకు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. పెద్ద పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకువస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా? అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఘోరంగా విఫలమైంది. ప్రజల తిరస్కరణకు గురైన కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది. లిక్కర్ స్కాం పేరుతో ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తుంది. అడ్డగోలుగా కేసులు పెడుతున్నారు. స్కాం ఎక్కడో ఇప్పటికీ తెలియడం లేదు. లిక్కర్ స్కాం డబ్బులు గల్ఫ్ అంటారు.. ఆఫ్రికా అంటారు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అన్నారు. రోజూ ఏదో ఒక పిట్టకథ చెప్తున్నారు. లేని.. జరగని ఒక స్టోరీ చెప్పి అక్రమ కేసులు పెడుతున్నారు. లిక్కర్ స్కాం పేరుతో ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.కేసుల పేరు చెప్పు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రజల్లోకి వైఎస్ జగన్ వెళ్లకుండా అడ్డుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ చేస్తున్నారు ఏపీలో ఒక ECM ఇద్దరు DCM లు ఉన్నారు. ఇద్దరు DCMలలో ఒకరు డిప్యూటీ సీఎం అయితే, మరొకరు డీఫ్యాక్టో సీఎం. వీరు ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. లిక్కర్ కేసులో అరెస్టులు ఎందుకు చేస్తున్నారు.. స్కాం ఎక్కడ జరిగిందో చెప్పాలి కదా. లిక్కర్ స్కాంలో అసలు దొంగ చంద్రబాబే. 2019-2024 మద్యం స్కాం జరగలేదు. 2014-2019 మధ్య జరిగింది అసలైన లిక్కర్ స్కాం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి చంద్రబాబు గండి కొట్టారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగింది. కూటమి ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీలో ప్రభుత్వ ఆదాయం పెరిగిందా?. లిక్కర్ డోర్ డెలివరీ చేసి బలవంతం తాగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 11 కోట్లు సీజ్ చేశారు.. అవి ఎవరివి?. అతని స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేశారా?. కేసిరెడ్డి ఎన్నికల ముందు డబ్బు దాస్తే ఇంతకాలం అలాగే అక్కడే ఉంటుందా?. లిక్కర్ స్కాం జరగలేదు మిథున్ రెడ్డి ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు. నెల్లూరు ఏమైనా కంచుకోటా.. కంచె వేసి అడ్డుకోవడం ఏమిటి?. మెయిల్స్ చేసి అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీ మాదిరి దిగజారి వ్యవహరించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్స్ ముందు మేం సరితూగం’ అని కామెంట్స్ చేశారు. -
నేనో సిట్టింగ్ ఎంపీని.. జడ్జి ఎదుట మిథున్రెడ్డి రిక్వెస్ట్
సాక్షి, విజయవాడ: లిక్కర్ కేసులో అరెస్టైన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి.. ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఇవాళ ఓ విన్నపం చేశారు. శుక్రవారం బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా.. ‘‘నేను మూడుసార్లు ఎంపీగా చేశా. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నా. నేను ఎలాంటి స్కాం చేయలేదు. ఇది ఒక అక్రమ కేసు. నేనేం దేశం విడిచి ఎక్కడికీ పారిపోను. నాకు బెయిల్ మంజూరు చేయాలి’’ అని కోరారాయన. ఇదిలా ఉంటే.. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందనే అభియోగాల మీద వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్నారీయన. జులై 20వ తేదీన సిట్ విచారణకు హాజరైన మిథున్రెడ్డిని.. ఏడుగంటల పాటు అధికారులు విచారించారు. ఆపై రాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. ఏసీబీ కోర్టు ఆగస్టు 1 దాకా రిమాండ్ విధించింది. ఆ రిమాండ్ నేటితో ముగియనుంది.ఇదిలా ఉంటే.. మిథున్రెడ్డి అరెస్ట్ను వైఎస్సార్సీపీ రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తోంది. జరగని స్కామ్ జరిగినట్లుగా తప్పుడు ఆధారాలు, సాక్ష్యాలు, వాంగ్మూలాలతో తమ కీలక నేతలను వేధింపులకు గురి చేస్తోందని కూటమి ప్రభుత్వంపై మండిపడుతోంది. -
అది నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా: అనిల్
సాక్షి, నెల్లూరు: తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్రికాలో తనకు ఎలాంటి మైనింగ్స్ లేవని స్పష్టం చేశారు. ‘‘గతంలో కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండి. నా దగ్గర రూ.వేల కోట్ల ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా’’ అంటూ అనిల్ సవాల్ విసిరారు.తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నా ప్రమేయం ఉందని శ్రీకాంత్ రెడ్డి చేత బలవంతంగా చెప్పించారు. అనిల్కి, కాకాణికి పడదని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసి మైనింగ్ చేశామని ఆరోపిస్తున్నారు’’ అంటూ అనిల్ మండిపడ్డారు.‘‘గూడూరు, నాయుడుపేటలో నేను, శ్రీకాంత్ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లలో ఇసుక రవాణాని ఏజెన్సీకీ ఇచ్చాం. నేను ఇసుక అక్రమ రవాణా చేసానని ఆరోపిస్తున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. నా ఆస్తి 1000 కోట్లు అంటున్నారు.. చంద్రబాబు విచారణ జరిపి అందులో 950 కోట్లు అమరావతి అభివృద్ధికి తీసుకుని, నాకు రూ.50 కోట్లు ఇస్తే చాలు. అవసరమైతే చంద్రబాబుకి లేఖ రాస్తాను. 2022 నుంచి ఇప్పటి వరకు ఎవరు మైన్ నుంచి రవాణా జరిగిందో ఈడీ ద్వారా విచారణ జరపండి.. నేనే కోర్టులో పిటిషన్ వేస్తాను’’ అని అనిల్ పేర్కొన్నారు. -
నెల్లూరులో హైటెన్షన్.. ప్రసన్నకుమార్రెడ్డి ఆఫీస్పై దాడికి యత్నం
సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆఫీస్పై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ శ్రేణలు అడ్డుకున్నాయి. వైఎస్సార్సీపీ నేతల ప్రెస్మీట్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ పర్యటన విజయవంతం కావడంతో అసహనంగా ఉన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి.. ప్రసన్నకుమార్ కార్యాలయంపైకి మహిళలను పంపించారు. పోలీసులు రావడంతో ప్రశాంతిరెడ్డి అనుచరులు పారిపోయారు.కూటమిలో కలవరం నిన్న(గురువారం) వైఎస్ జగన్ రాకతో సింహపురి జన ఝరిగా మారిన సంగతి తెలిసిందే. రాప్తాడు.. పొదిలి.. రెంటపాళ్ల.. బంగారుపాళ్యం.. ఇలా పర్యటన.. పర్యటనకు మించిన జన సునామీ నెల్లూరును తాకడం కూటమి నేతల్లో వణుకు పుట్టించింది.జననేత పర్యటనను అడ్డుకునేందుకు ఊరూరా ఆంక్షలు విధించినా.. పెద్ద సంఖ్యలో చెక్పోస్ట్లు.. అడుగడుగునా బారికేడ్లు.. ముళ్ల, ఇనుప కంచెలను నెలకొల్పినా.. రహదారులను ధ్వంసం చేసినా, ఇవేవీ పార్టీ అభిమానులను అడ్డుకోలేకపోయాయి. వారిని నిర్బంధించలేకపోయాయి. పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసేందుకు అనేక అడ్డంకులు సృష్టించినా.. ఖాకీలు లాఠీలను ఝళిపించినా.. ఊహించని స్థాయిలో పోటెత్తారు. -
ఐటీ డెవలప్మెంట్ పేరిట విశాఖలో దోపిడీ: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కొనసాగుతున్న అరాచక పాలనపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి పాలనలో జరుగుతున్న విశాఖ దోపిడీతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇష్టానుసారం హత్యలు జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో కన్నా.. ఈ ఒక్క ఏడాదిలో కాలంలోనే క్రైమ్ రేటు ఎంతో పెరిగింది. కూటమి నేతల్లో అసహనం పెరిగిపోతోంది. మంత్రులు అలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. జగన్ నెల్లూరు పర్యటనకు వెళ్తే.. కార్యకర్లు రాకుండా రోడ్లు తవ్వారు అని అన్నారాయన.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకే దక్కులేదు. కానీ.. కొత్తగా డేటా సెంటర్లు తెచ్చినట్లు చెప్పుకోవడం ఏంటి?. లులు సంస్థకు భూముల విషయంలో లాలూచీ పడ్డారు. రూ.1,500 కోట్ల విలువైన స్థలాన్ని ఆ కంపెనీకి 99 ఏళ్లకు అప్పగిస్తున్నారు. కానీ, అందులో సగం పెట్టుబడి కూడా రాదు. అసలు కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఆలోచన ఉందా?. అలాగే టీసీఎస్కు అప్పన్నంగా భూములు కట్టబెడుతున్నారు. డేటా సెంటర్ మేం పెట్టలేదా?. వైజాగ్లో ఐటీ సెంటర్ను ప్రొత్సహించింది డాక్టర్ వైఎస్సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో విశాఖలో దోపిడీ జరుగుతోంది అని అన్నారాయన. చట్టానికి వ్యతిరేకంగా ఎవరిని మేం సమర్థించబోం. రోజా గురించి ఎలా మాట్లాడారో అంతా చూశారు. కానీ, కూటమి నుంచి తప్పని ఎవరైనా అన్నారా? అని బొత్స నిలదీశారు.