బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితాను కచ్చితత్వంతో రూపొందించాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడు, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ షణ్మోహన్ సగిలి ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియను గడువులోగా పక్కాగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రక్రియలను అక్టోబర్ 5వ తేదీలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓల పని తీరును పర్యవేక్షించాలని సూచించారు. అక్టోబర్ 9న ఓటర్ల తుది జాబితా ప్రచురణకు అవసరమైన అన్ని సన్నాహాలూ ముందుగానే పూర్తి చేయాలని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 88.15 శాతం, వివిధ నోటీసుల జారీ ప్రక్రియ 100 శాతం పూర్తయ్యాయని తెలిపారు. హియరింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుందని, ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులను మరో రెండు రోజుల్లోగా పరిష్కరిస్తామని చెప్పారు.


