అమలాపురం టౌన్: పాతికేళ్లుగా అసంపూర్తిగా, నత్తనడకన సాగుతున్న కోనసీమ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్ఎస్ఎస్) ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అంబాజీపేట మండల పర్యటనకు బుధవారం వచ్చిన సీఎంకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రైల్వే లైన్కు అవసరమైన భూ సేకరణలో ఎదురవుతున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం చక్కదిద్దాలని కోరారు. ఈ ప్రాజెక్ట్కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.1,200 కోట్లు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. భూ సేకరణకు సంబంధించి అన్ని కేసులపై స్టేలను కోర్టులు తొలగించినందున ఈ రైల్వే ప్రాజెక్ట్కు సమస్యలు దాదాపు తొలగినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రైల్వే లైన్ను తొందరగా పూర్తి చేసి, ఈ ప్రాంత వాసుల చిరకాల కోరికను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్ఎస్ఎస్ ప్రతినిధులు డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, సప్పా నాగేశ్వరరావు, ఎరగర్త వెంకటేశ్వరరావు, పోలిశెట్టి శివాజీ తదితరులు సీఎంకు వినతిపత్రం అందించారు.


