● 2025 ఓటర్ల జాబితా ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్లపై ప్రభావం
● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా
కడప కార్పొరేషన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఓట్లు అనిశ్చితి లో పడ్డాయి.. సర్ పూర్తయి తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా డిమాండ్ చేశారు. గురువారం తన కార్యాలయంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్లకు ఒకసారి సర్ ప్రోగ్రాం జరుగుతుందని, ఇందులో మరణించినవారు, శాశ్వితంగా వలస వెళ్లినవారు, డబుల్ ఎంట్రీలను తొలగిస్తారన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురితమవుతుందని.. ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. సర్ ప్రోగ్రాంలో మొత్తంగా 87లక్షల ఓట్లు అనిశ్చితిలో ఉన్నాయన్నారు. కడప అసెంబ్లీ నియోజకర్గంలో 2.87లక్షల ఓట్లు ఉండగా, సర్ ప్రోగ్రాంలో 67 వేల ఓట్లు తొలగించారని, మరో 77వేల మందికి నోటీసులు ఇచ్చారన్నారు. 1.44లక్షల ఓట్లను తీసేస్తారో, ఉంచుతారో తెలియని పరిస్థితి ఉందన్నారు. తుది జాబితా ప్రకటించిన తర్వాత ఎవరి ఓట్లు ఉన్నాయో, లేదో తెలుసుకునే వీలుంటుందన్నారు. 2025 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్లు తారుమారు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అలాగే కడపలో వార్డు ల పునర్విభజన అంశం హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. ఒక్కో డివిజన్లో 1000–1500 ఓట్లు తొలగించిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయ మై ఎన్నికల కమిషన్కు, ప్రభుత్వానికి పార్టీ తరఫున విన్నవించామని, జిల్లాలో తాము కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శివప్రసాద్, బంగారు నాగయ్య యాదవ్, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, మాజీ కార్పొరేటర్లు షఫీ,శ్రీరంజన్రెడ్డి, బసవరాజు పాల్గొన్నారు.


