చక్రాయపేట : వైఎస్సార్ కడప జిల్లా చక్రాయ పేట మండలం కల్లూరుపల్లెకు చెందిన సిద్దా రెడ్డెమ్మ గత గురువారం మస్కట్లో మృతిచెందింది. కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి చొరవతో రెడ్డెమ్మ మృతదేహం గురువారం(20వతేదీ) అర్ధరాత్రి కల్లూరుపల్లెకు చేరుకుంది. రెడ్డెమ్మ బంధువులు తెలిపిన మేరకు కల్లూరుపల్లెకు చెందిన సిద్దా రామచంద్ర భార్య రెడ్డెమ్మ జీవనోపాధి నిమిత్తం 11 నెలల క్రితం రాయచోటికి చెందిన రఫీ అనే ఏజెంట్ ద్వారా మస్కట్కు వెళ్లింది. అయితే ఏజెంట్ రూ.2 లక్షలు డబ్బు తీసుకొని ఆమెకు కచ్చితమైన వీసా ఇవ్వకుండా మోసం చేశాడు. దీంతో ఆమె మస్కట్ వెళ్లినా వీసా లేని కారణంగా ఎవరూ పనిలోకి తీసుకోలేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న రెడ్డెమ్మ భర్త రామచంద్రకు వియాన్ని చెప్పి అక్కడ ఉన్న తెలిసిన ప్రవాసాంధ్రుల సహకారంతో దొంగగా పనులు చేసుకునేది. ఇటు ఇండియాకు రాలేక అక్కడ పనులు చిక్కక ఆవేదనతో కుమిలి పోయి అనారోగ్యానికి గురైంది. ఈవిషయాన్ని అక్కడి వారు మస్కట్లో ఉన్న వైఎస్సార్సీపీ ఒమన్ అధ్యక్షుడు గుబ్బల భాస్కర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన రెడ్డెమ్మను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించాడు. అయినా ఆమె గత గురువారం మృతి చెందింది. ఈవిషయాన్ని కుటుంబ సభ్యులకు ఆయన ఫోన్ చేసి విషయం చెప్పడంతో కన్నీటి పర్యంతం అయ్యారు. మస్కట్లో రెడ్డెమ్మ అగచాట్ల గురించి చక్రాయపేట మండల వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు, రెడ్డెమ్మ సమీప బంధువు పోతపాళెం సభాపతి నాయుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి తీససుకెళ్లాడు. ఇందుకు స్పందించిన ఆయన రెడ్డెమ్మ ఆస్పత్రి ఖర్చులకు ఆర్థిక సాయం అందించారు. ఆమె చనిపోయిన విషయాన్ని తెలుసుకొని అక్కడి ఎంబసీ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. విమాన ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఆమె మృతదేహాన్ని కల్లూరుపల్లెకు చేర్చేందుకు కృషి చేశారు.


