ప్రొద్దుటూరు క్రైం : అనారోగ్యంతో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందింది. సుమారు 45 ఏళ్ల వయస్సున్న మహిళ అనారోగ్యంతో బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. ఆస్పత్రిలో చేరినప్పుడు ఆమె ఒంటిపై చిరిగిన దుస్తులు ఉండటంతో స్థానికులు మానవతా దృక్పథంతో పాత స్కూల్ యూనిఫాంను అందించారు. ఆమెకు సంబంధించిన ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతురాలి ఆచూకీ లేదా కుటుంబ సభ్యుల వివరాలు ఎలిసిన వారు ఆస్పత్రి ఔట్పోస్టులో సంప్రదించాలని ఇన్చార్జి షబ్బీర్ బాషా తెలిపారు.
రిమ్స్లో..
కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో వైద్య పరీక్షలను చేయించేందుకు గుర్తు తెలియని వ్యక్తి (55)ని తీసుకుని వచ్చారు. క్యాజువాలిటీలో వైద్య పరీక్షల అనంతరం మరణించినట్లు తెలియజేశారు. మృతదేహాన్ని మార్చురీకీ తరలించారు. ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే వారికి మృతదేహాన్ని అప్పగిస్తామనీ రిమ్స్ అధికారులు తెలియజేశారు.


