ప్రొద్దుటూరు : తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.1500 కోట్ల విలువైన భూములను స్వాహా చేశామని బూచిగా చూపి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితోపాటు ఆయన కుమారుడు కొండారెడ్డి ఇంత వరకు ఎందుకు బయటపెట్టలేకపోతున్నారని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ప్రశ్నించారు. ఆయన బుధవారం వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడు ఖాజాపీర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికై నా బురద చల్లే పనులను మానుకోవాలని కోరారు. రెండున్నర సంవత్సరాలైనా తాము భూములు కబ్జా చేసి ఉంటే విచారించి ఎందుకు కేసులు పెట్టలేకపోయారన్నారు. వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు రూ.100 కోట్ల స్కాం జరిగిందని, అందులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి హస్తం ఉందని విమర్శలు చేయడం హాస్యాస్పందంగా ఉందన్నారు. శ్రీనివాసనగర్లో ప్రభుత్వ స్థలం మూడు సెంట్లు ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. ఇందులో తమకు రూ.2.5 కోట్లు వచ్చిందని ఆరోపణలు చేశారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న తమకే రూ.2.5 కోట్లు వస్తే అధికార పార్టీలో ఉన్న వరదరాజులరెడ్డికి, ఆయన సోదరుడు రాఘవరెడ్డికి, కొండారెడ్డికి ఏమాత్రం వచ్చిందన్నారు.
వార్త వేసి ఖండన రాశారు
ఈ ఏడాది ఏప్రిల్ 24న సాక్షి పత్రికలో శ్రీనివాసనగర్ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్పై ప్రచురించిన కథనాన్ని బంగారు మునిరెడ్డి చూపించారు. న్యాయవాది సంధాని మరుసటి రోజు ఇచ్చిన ఖండనను కూడా పత్రికలో ప్రచురించారన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా రాచమల్లు చెప్పిఉంటే పత్రికలో మరుసటి రోజు రాశారని చెప్పడం దురదృష్టకరమన్నారు. బుర్ర లేకుండా నాగరాజులాంటి వారితో మాట్లాడిస్తే మీకే నష్టం జరుగుతుందని టీడీపీ నాయకులను ఉద్దేశించి అన్నారు. రూ.1500 కోట్ల భూములలో స్కాం జరిగి ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు.
మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
పాతకోట బంగారు మునిరెడ్డి


