వేంపల్లె : వేంపల్లెలోని అర్బన్ పోలీస్స్టేషన్లో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వేంపల్లె పట్టణంలో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. వేంపల్లె పట్టణ వ్యాప్తంగా నిఘా నేత్రాలు ఉన్నాయని, చిన్న ఘటన జరిగిన వెంటనే తెలుసుకునేందుకు వీలు ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల్లో అవసరమైన చోట్ల పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు కమాండ్ కంట్రోల్ గదిలో విద్యార్థినులకు సీసీ కెమెరాల పని తీరు, భద్రతపై ఎస్పీ అవగాహన కల్పించారు. సీసీ కెమెరాలకు ఆర్థిక సహాయం చేసిన దాతలను ఆయన శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సీఐలు నరసింహులు, శ్రీరామ్, శాంతిలాల్, ప్రసాదరావు, ఎస్ఐలు తిరుపాల్ నాయక్, ప్రవీణ్, శ్రీప్రియ, చంద్రశేఖర్, స్వామి వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ రామాంజనేయరెడ్డి, శ్రీచైతన్య పాఠశాల డైరెక్టర్ చేతన్ రెడ్డి, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయణరెడ్డి, శ్రీనివాస పాఠశాల కరస్పాండెంట్ కేశవులు, అక్షర మహిళా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ విజయభారతి, ఉషాకిరణ్ పాఠశాల పీఈటీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


