● వందల ఏళ్ల నుంచి గంగమ్మతల్లికి పూజలు
రాజంపేట రూరల్ : రాజంపేట పట్టణం నూనివారిపల్లి నడిబొడ్డున కొన్ని వందల సంవత్సరాల నుంచి గంగమ్మతల్లిని ఏర్పరుచుకొని పూజలు నిర్వహించుకునే.. గ్రామ కంఠం భూమి సర్వే నంబర్ 918లోని 2.50 సెంట్లను కబ్జా చేసినట్లు గ్రామ ప్రజలు మద్దిపట్ల పవన్కుమార్, తలపనేని వేంకటేశ్వర్లు, మద్దిపట్ల రాజేంద్ర, పల్లేటి ప్రసాద్, భీమినేని రమేష్ ఆరోపించారు. ఆదివారం ఆ స్థలం వద్ద వారు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు రికార్డులను క్షణ్ణంగా పరీశీలించి సంయుక్తంగా సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. రికార్డుల ప్రకారం సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆ భూమిలో సంప్రదాయ బావిని మూసివేయటం ఎంత వరకు సంజసమని ప్రశ్నించారు. ఆ స్థలంలో దర్జాగా కాంపౌడ్ వాల్ నిర్మించి భక్తులు పూజలు చేసుకోవటానికి కూడా వీలు లేకుండా చేయటం సబబేనా అని నిలదీశారు. గ్రామ ప్రజల విశ్వాసాలను, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను గౌరవిస్తూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. కబ్జా స్థలంలో ఏర్పాటు చేసిన అనధికార నిర్మాణాలను తొలగించాలన్నారు. కబ్జా స్థలంను గంగమ్మతల్లి పూజల కోసం భవిష్యత్ తరాల కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు.


