మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని నానుబాలపల్లెకు చెందిన ముగ్గురు కౌలు రైతుల పొలాల వద్ద దుండగులు పురుగు నివారణ మందులు, మోటార్ వైర్లను, లైన్ వైర్లను ఎత్తుకెళ్లారు. బాధితులు తెలిపిన మేరకు శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నానుబాలపల్లెకు చెందిన బుసగాని చంద్రశేఖర్ యాదవ్, బుసగాని చెండ్రాయుడు, మేకల నరసింహులు అనే కౌలు రైతులు ఉల్లి, మిరప, కూరగాయల పంటలను సాగు చేశారు. పొలాల వద్ద చిన్న రూములు కట్టి అందులో మోటారు వైర్లు, పురుగు మందులు నిల్వ చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి దుండగులు రైతుల రూములకున్న తాళాలను పగలగొట్టి అందులో ఉన్న పురుగు మందులు, మోటార్ వైర్లు, లైన్ వైర్లను ఎత్తుకెళ్లారు. ఉదయ పొలాల వద్దకు వెళ్లిన రైతులు రూముల తాళాలను పగలగొట్టి ఉండటం చూసి లబోదిబోమన్నారు. దుండగుల దుశ్చర్యతో ఆర్థిక నష్టంతోపాటు పొలాలకు నీరు అందని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. తన పొలం వద్ద చోరీ జరగడం ఇది రెండో సారని, నాలుగు నెలల కిందటే దొంగలు తన మోటార్ వైర్ను ఎత్తుకెళ్లారని చంద్రశేఖర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత రైతులు తెలిపారు.
కడప అర్బన్ : తన 8 ఏళ్ల కుమార్తైపె లైంగిక దాడికి యత్నించిన తండ్రిని అరెస్టు చేసినట్లు కడప టూ టౌన్ పోలీసులు తెలిపారు. టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడికి ప్రయత్నించడంతో.. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు.


