చెన్నూరు(వల్లూరు) : చెన్నూరు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ మోటార్ల వైర్ల దొంగతనాలు ఆగడం లేదు. నెల రోజుల్లోపే వరుసగా మూడు సార్లు గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు వైర్ల దొంగతనాలు జరగగా రైతులు వాటిని తిరిగి అమర్చుకున్నారు. తాజాగా శనివారం రాత్రి చెన్నూరు గ్రామ శివారులోని పాత దళితవాడ సమీపంలోని పొలాల్లో రైతుల వ్యవసాయ మోటర్ల వైర్లు చోరీకి గురయ్యాయి. జహీరుల్లా, మస్తాన్, జవాహీద్, చింతగుంట రమణారెడ్డి అనే రైతుల వ్యవసాయ మోటార్ల వైర్లను దొంగలు కత్తిరించుకుపోయారు. ఆదివారం ఉదయం పొలాలకు నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతులు ఈ విషయాన్ని గుర్తించారు. రామనపల్లె పాతూరు పొలాల్లోని పలు వ్యవసాయ మోటార్ల వైర్లు సైతం దొంగలు కత్తిరించుకుపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా రామనపల్లె గ్రామానికి చెందిన ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే రెండు పంపు సెట్ల వైర్లను దొంగలు రెండవ సారి కత్తిరించుకుపోయారని రామనపల్లె గ్రామపంచాయతీ పీడీవో తెలిపారు. దీంతో ప్రజలు తాగునీటి అవసరాలకు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆగస్టు 8వ తేదీన చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకొని రైతులను కాపాడాలని గ్రామస్తులు వేడుకొంటున్నారు.


