ప్రొద్దుటూరు క్రైం : టీచర్ మందలించడంతో పాఠశాల నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయిన ఏడో తరగతి విద్యార్థిని ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు కేవలం రెండు గంటల్లోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. చాపాడు మండలంలోని రామదాసుపురానికి చెందిన పేట ఆకాష్ టీచర్స్ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఓ సబ్జెక్ట్ విషయంలో టీచర్ మందలించడంతో మనస్తాపానికి గురై.. పాఠశాల యాజమాన్యానికి, తోటి విద్యార్థులకు చెప్పకుండా మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లిపోయాడు. భోజన విరామం తర్వాత తరగతులు ప్రారంభమైన సమయంలో ఆకాష్ కనిపించకపోవడంతో యాజమాన్యం ఆందోళనకు గురైంది. పాఠశాల ఇన్చార్జి వెంటనే ఈ విషయాన్ని రూరల్ పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ వెంటనే స్పందించి సిబ్బందితో కలిసి విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాఠశాల పరిసర ప్రాంతాలు, విద్యార్థి వెళ్లే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఆకాష్ను గుర్తించారు. అనంతరం బాలుడిని సురక్షితంగా కుటుంబ సభ్యులు, పాఠశాల యాజమాన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ పిల్లలు కనిపించకుండా పోయినప్పుడు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు ఆందోళనతో సమయం వృథా చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే, వేగంగా స్పందించి గాలింపు చర్యలు చేపట్టడం ద్వారా సమస్యను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు.


