కడప సెవెన్ రోడ్స్ : విద్యా రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఐక్య ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ఏఎస్వైఎఫ్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఓబయ్య అన్నారు. బుధవారం కడప నగరంలోని పద్మశ్రీ ఓకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఏఎస్వైఎఫ్ రాష్ట్ర మొదటి మహా సభలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని కోరారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. పీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బారాయుడు, పీఆర్ఎస్వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, ఏఐబీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల విద్య అనేది అంగడి సరుకుగా మారిందన్నారు. విద్యను వ్యాపారంగా మార్చే ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించాలని, ప్రతి విద్యార్థికి సమానంగా నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో వున్నా ఫీజు బకాయిలు, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జిలను ధరలకు అనుగుణగా పెంచాలని డిమాండ్ చేశారు. పీఎఆర్ఎస్వైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర బాబు, ఏఎస్వైఎఫ్ నాయకులు ఆఫ్రిదు, అబ్దుల్, అహ్మద్, ప్రీతి, వెంకటలక్ష్మి, అనూష, గౌతమి పాల్గొన్నారు.


