జమ్మలమడుగు : డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారాలోకేష్ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ విజయవంతం కావడంతో పోలీసులు కేసులు నమోదు పనిలో పడ్డారు. ఇప్పటికే పోలీసులు క్రైం నంబర్ 213/2026 అండర్ సెక్షన్ కింద, 189/2, 223, 126(2), 132, 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ తనయుడు పొన్నపురెడ్డి వెంకట శివారెడ్డి గిరిధర్రెడ్డి హృషికేశవరెడ్డి, ముల్లాజానీ, పోచిరెడ్డి రమణారెడ్డి, గజ్జల లక్షుమయ్య మరో18 మందిపై కేసులు నమోదు చేశారు. మొత్తం 400 మందిపై కేసులునమోదు చేసి మిగతా వారిని గుర్తించే పనిలో పడ్డారు.
పశుగ్రాసం కొరత
నివారణకు చర్యలు
ఎర్రగుంట్ల : ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడిన పశుగ్రాసం కొరత నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరులో భారతి సిమెంట్ ఫ్యాక్టరీ ఇచ్చిన 15 ఏకరాల పొలంలో గడ్డి క్షేత్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 30 మంది పొలం లేని పశువులు కలిగిన రైతులకు లబ్ధి చేకూరేల గడ్డి పెంపకం చేస్తున్నామని పశుసంవర్ధశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం పొలంలో గడ్డి విత్తనాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తిప్పలూరు లో 350 కిలోల సీఎస్హెచ్–24 రకానికి చెందిన జొన్న విత్తనాలను రైతులకు ఉచితంగా అందించినట్లు తెలిపారు. మండలంలో సామూహిక గడ్డి క్షేత్రాలు ఏర్పాటు చేసేందుకు రైతులు ముందుకు వస్తే వారికి ఉచితంగా విత్తనాలు అందిస్తామన్నారు.


