చాపాడు : ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి శ్రీశైలం ప్రాజెక్టుకు 879 అడుగుల నీరు చేరినప్పటికీ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేసీ కెనాల్కు సాగు నీటిని విడుదల చేయకపోవడం చాలా దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన తన నివాసంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డితో కలిసి మాట్లాడుతూ గతంలో 875 అడుగులు నీళ్లు వచ్చినప్పుడు నీటిని వెంటనే వదిలేవారన్నారు. కేసీకి సాగు నీటిని విడుదల చేయలేమని మంత్రి, కలెక్టర్ చెప్పే మాటాలు రైతులను నిరుత్సాహపరుస్తున్నాయన్నారు. వర్షాలు పడి ప్రాజెక్టు నిండితే రబీకి నీటిని విడుదల చేస్తామి నేతుల, అధికారులు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీశైలంలో 854 అడుగులు తగ్గిపోతే కేసీ కెనాల్ పరిధిలోని 92,000 ఎకరాల ఆయకట్టు ఎడారిగా మిగిలిపోతుందన్నారు. కుందూనది వెంబడి ఎత్తిపోతుల పథకాలకు, పశువులకు తాగునీరు లేకుండా ఇబ్బందిగా ఉంటుందన్నారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిని కేసీ కెనాల్కు గతంలో తుంగభద్ర నుంచి 10 టీఎంసీల నీటిని కేటాయింపు ఉందన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్కు 10 టీఎంసీలు కేటాయించారన్నారు. ఈ నెలాఖరులోగా కేసీ కెనాల్కు, బ్రహ్మసాగర్కు నీటిని వదిలి నింపాలన్నారు. అలా కానీ పక్షంలో రైతులతో కలిసి ఇడమడక నుంచి కడప వరకు రాస్తారోకో, హైవే నిర్బంధం చేస్తామని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి


