● ప్రత్యామ్నాయ మార్గాలున్నా
నీరివ్వకపోవడం దారుణం
● శ్రీశైలంలో రోజురోజుకూ తగ్గుతున్న నీటి నిల్వలు
కడప కార్పొరేషన్ : తుంగభద్ర జలాశయంలో 85 టీఎంసీల నీరు చేరిందని, అందులోంచి ఆంధ్రప్రదేశ్ వాటా నీటితో గండికోట జలాశయంలో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిల్వ ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. గండికోట కింద పంట కాలువలు పూర్తి కానందున, ఆ నీటిని కేసీ కాలువకు మళ్లించి రైతులకు ఇవ్వవచ్చని చెప్పారు.ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా, రైతుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా నంద్యాల కలెక్టర్ ప్రకటన చేయడం దారుణమన్నారు. శ్రీశైలం జలాశయంలోకి వచ్చే నీటికంటే వివిధ పథకాలకు, విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్న నీరే ఎక్కువగా ఉండటంతో రోజురోజుకూ నీటి మట్టం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2012లో కేవలం 868 అడుగుల నీరు ఉన్నప్పుడే కేసీ కాలువ ఇరుకారు పైర్లకు నీరు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని గుర్తుచేశారు. కలెక్టర్ చేసిన ఆ ప్రకటనను ప్రభుత్వం సమర్థిస్తుందో లేదో స్పష్టం చేయాలని రెడ్యం డిమాండ్ చేశారు. తక్షణమే కేసీ కాలువకు నీటిని విడుదల చేయించాలని, లేనిపక్షంలో రైతాంగంతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.


