● జొన్న, మినుము, మొక్కజొన్న సాగుకు శ్రీశైలం నీరే ఆధారం
● వైఎస్సార్సీపీ రైతు విభాగం
జిల్లా అఽధ్యక్షుడు ప్రసాద్రెడ్డి
కడప కార్పొరేషన్ : శ్రీశైలం ప్రాజెక్టు నిండినా కేసీ కెనాల్, బ్రహ్మంసాగర్, కుందూనదికి నీటిని విడుదల చేయాలని వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఎగువన వర్షాలతో శ్రీశైలంలో ప్రస్తుతం 879 అడుగుల నీటి నిల్వ ఉందని, 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని తెలిపారు. గతంలో 875 అడుగులు ఉన్నప్పుడే కేసీ కెనాల్, తెలుగుగంగకు నీరిచ్చిన దాఖలాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి, తెలంగాణ ఎత్తిపోతల పథకాల పేరుతో రోజుకు 60 వేల క్యూసెక్కుల నీటిని తోడేస్తున్నారని ఆరోపించారు. రబీలో వర్షాలు పడితేనే నీరిస్తామనడం సరికాదని, నీటి మట్టం 854 అడుగుల లోపలికి పడిపోతే కడప జిల్లాతో పాటు రాయలసీమ మొత్తం ఎడారిగా మారుతుందని హెచ్చరించారు.
ఆరుతడి పంటలైన జొన్న, మినుము, మొక్కజొన్నలను సాగు చేసుకునేందుకు, అలాగే కుందూ పరీవాహక ప్రాంతంలో తాగునీటి పథకాలు, పశువుల తాగునీటి అవసరాల కోసమైనా కుందూ నదికి ఎస్కేఈ ఛానెల్ (నిప్పుల వాగు) ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కేసీ కెనాల్కు గతంలో తుంగభద్ర నుంచి 10 టీఎంసీల నీటి కేటాయింపు ఉండేదన్నారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తుంగభద్ర నీటిని హెచ్ఎన్ఎస్ఎస్కు మళ్లించి, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీలను కేసీ కెనాల్కు కేటాయించారని గుర్తుచేశారు. చట్టబద్ధమైన కేటాయింపులు ఉన్నందున రైతులకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాల్సిన కనీస బాధ్యత ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ బాలయ్య యాదవ్, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, సీకే దిన్నె కన్వీనర్ శ్రీనివాసులరెడ్డి, భాస్కర్రెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


