రాజంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలో రాజంపేట మండల శివారు ప్రాంతం వెంకటరాజంపేటలో మంగళవారం హెచ్పీ పెట్రోలు బంకుల వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. వీరంతా రాజంపేట నుంచి పుల్లంపేటకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అదుపు తప్పిన బైక్
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలో చింతకుంట గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పడంతో రాజశేఖర్రెడ్డి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. మంగళవారం ఉమ్మారెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్రెడ్డి తాడిపత్రి నుంచి మోటార్బైక్పై స్వగ్రామానికి వస్తుండగా గాలేరు–నగరి కాలువ వద్ద బైక్ అదుపుతప్పి కింద పడి పోయాడు. గాయపడిన ఆయనను 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు
సుండుపల్లె : మండల పరిధిలోని చిన్నగొల్లపల్లి గ్రామ పంచాయతీ రాజయ్యగారిపల్లికి చెందిన మల్లికార్జుననాయుడు విష పదార్థం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సుండుపల్లి ఎస్ఐ మహేష్కు ఫోన్లో సమాచారం ఇచ్చి అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. వెంటనే ఎస్ఐ స్పందించి ఆ వ్యక్తి లొకేషన్ ట్రేస్ చేసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్, హోంగార్డు రవినాయక్, గ్రామస్తులు కలిసి మల్లికార్జుననాయుడును సకాలంలో రక్షించి 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుండుపల్లి పోలీసుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పడంతో కుటుంబ సభ్యులు ఎస్ఐ మహేష్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఆరుగురికి గాయాలు


