కడప అర్బన్ : తెలంగాణలోని హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలో జూలై 23 నుంచి 30 వరకు నిర్వహించిన 11వ అఖిల భారత పోలీస్ గేమ్స్–2026లో కడప జిల్లా పోలీస్ సిబ్బంది విశేష ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన పోలీస్ సిబ్బంది ప్రొద్దుటూరు త్రీటౌన్ పి.ఎస్ మహిళా కానిస్టేబుల్ పి.శివకుమారి, ప్రొద్దుటూరు టూ టౌన్ ఎస్ఐ ఎస్.మహబూబ్ బాషా, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పీఎస్ కానిస్టేబుల్ ఎస్.పి.మహబూబ్ బాషాలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పోలీస్ క్రీడా పోటీలలో వ్యక్తిగత విభాగంలో ప్రొద్దుటూరు త్రీ టౌన్ పి.ఎస్ (డబ్ల్యూ పీసీ–2186) పి.శివకుమారి పెంచాక్ సిలాట్ క్రీడలో ఓపెన్ 2 ఓవర్ 100 కేజీ విభాగంలో రజత పతకం సాధించారు. ప్రొద్దుటూరు టూటౌన్ పీఎస్ ఎస్ఐ ఎస్.మహబూబ్ బాషా, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పీఎస్ (పీసీ–2559) ఎస్.పి.మహబూబ్ బాషా తైక్వాండో క్రీడలో పూమ్సే విభాగంలో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుని విశేష ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


