● భర్త మరణ వార్త విని భార్య మృతి
దువ్వూరు : మరణంలోనూ భార్యాభర్తల బంధం వీడలేదు. అనారోగ్యంతో భర్త మృతి చెందగా, ఆ వార్త తెలిసిన వెంటనే భార్య మృతి చెందిన విషాదకర సంఘటన దువ్వూరులో చోటు చేసుకుంది. మండల కేంద్రమైన దువ్వూరు టీచర్స్ కాలనీకి చెందిన ఇరగంరెడ్డి వెంకటరామిరెడ్డి (79) తెలుగు పండిట్గా 2005లో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు భార్య నారాయణమ్మ (68), కుమారులు శ్రీహరిరెడ్డి, చంద్రహాస్రెడ్డి, జయదేవ్ రెడ్డి ముగ్గురు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వెంకటరామిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కుమారుల వద్ద హైదరాబాద్లో ఉంటున్నారు. ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు మృతి చెందారు. భర్త మరణ వార్త విన్న నారాయణమ్మ సొమ్మసిల్లి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని బంధువులు వివరించారు. భార్యాభర్తలు ఒకేసారి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులతోపాటు దువ్వూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను హైదరాబాద్ నుంచి దువ్వూరుకు తరలించి అంత్యక్రియలు చేయనున్నట్లు బంధువులు తెలిపారు.


