● పలు చోట్ల బంద్ పోటు !
● జిల్లావ్యాప్తంగా 2,042 పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహణ
ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద
విద్యార్థి సంఘాలను అడ్డుకుంటున్న పోలీసులు
కడప గాంధీనగర్ పాఠశాలలో జరిగిన సమావేశంలో
మాట్లాడుతున్న జేసీ నిధిమీనా
కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)– 4.0 కార్యక్రమానికి ఈ ఏడాది అంత హడావుడి కనిపించలేదు. విద్యార్థి సంఘాల బంద్ కారణంగా పేరెంట్ మీటింగ్లను అడ్డుకుంటారని జిల్లాలో పలు పాఠశాలల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కడప నగరంలో పలు ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం నిర్వహించారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా శుక్రవారం పలు విద్యార్థి సంఘ నాయకులు బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బంద్ వల్ల పలు చోట్ల పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. పలు చోట్ల విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్ని చోట్ల విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. గతేడాదంతా హడావుడి లేకుండా చప్పగా సాగింది. రెండు రోజుల క్రితమే తల్లికి వందనం డబ్బులు తల్లుల ఖాతాలకు నగదు జమకావడంతో ప్రజాప్రతినిధులకు కాసింత మాట్లాడేందుకు అవకాశం దొరికింది. అంతకు మించి వారికి మాట్లాడే విషయాలు లేకపోవడంతో సమావేశాలు చప్పగా సాగాయనే ఆరోపణలు వినిపించాయి.
జిల్లావ్యాప్తంగా 2042 పాఠశాలల్లో...
జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఆదర్శ, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో భాగంగా 2042 పాఠశాలల్లో శుక్రవారం ఈ సమావేశాలను నిర్వహించారు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలో నియమితులైన మండలస్థాయి ప్రత్యేక అధికారుల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సమావేశాల్లో దాదాపు లక్షా యాభైవేల మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని తమ పిల్లల చదువు, హాజరు, భవిష్యత్ లక్ష్యాలపై ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా చర్చించారు. కడపలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన మెగా పీటీఎంలో జేసీ నిధిమీనా పాల్గొని విద్యార్థులు, వారి తల్లితండ్రులలో చర్చించారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని రుచి చూశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. సమావేశంలో కడప నగరపాలక ఆదనపు కమిషనర్ రాకేషచంద్ర, ఏపీసీ అనుఽరాధ తదితరులు పాల్గొన్నారు.


