లింగాల : మండలంలోని వివిధ గ్రామాల్లో 90శాతం సబ్సిడీతో రైతులకు అందించిన డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను శుక్రవారం ఏపీఎంఐపీ పీడీ బీవీ రమణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలవల్ల నీటి ఆదాతోపాటు పంట దిగుబడి పెంచుకుని రైతులు అధిక లాభాలు పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంఐ ఏఓ మౌళాలి, డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన
పాస్పోర్ట్ సేవలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: ప్రజలకు మెరుగైన, వేగవంతమైన పాస్పోర్ట్ సేవలను అందిస్తామని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి నందులాల్ భూక్యా పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన.. నగరంలోని ప్రధా న తపాలా కార్యాలయంలో ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ముందు గా కడపకు చేరుకున్న ఆయనకు స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద కడప పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ జి.రాజేష్, పాస్పోర్ట్ సేవా కేంద్రం ఇన్చార్జి వి.ఓ.సుమిత్ కుమార్, పి.మునాఫ్లు స్వాగతం పలికారు. అనంతరం సేవా కేంద్రాన్ని సందర్శించిన ప్రాంతీయ అధికారి.. అక్కడ దరఖాస్తుదారులకు కల్పిస్తున్న వసతులు, సేవల నాణ్యత, పారదర్శకత,పనితీరు వేగాన్ని సమీక్షించారు.
ముగిసిన ‘ఎన్యుమరేషన్’
కడప సెవెన్రోడ్స్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ పక్రియ శుక్రవారంతో ముగిసింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 14వ తేది నాటికే ముగియాల్సి ఉంది. అయితే రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి అభ్యర్థన మేరకు భారత ఎన్నికల సంఘం ఈనెల 24వ తేది గడువు పొడిగించింది. జిల్లాలో మొత్తం 18,96,231 ఓట్లు ఉండగా, వంద శాతం మందికి ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ జరిగింది. చివరిరోజు 87.09 శాతం ఎన్యుమరేషన్ పత్రాల డిజిటైజేషన్ పూర్తయింది. ఇక మిగిలిన 12.91 శాతం ఓట్లు వివిధ కారణాలతో తొలగించారు.
దశలవారీ సమ్మెకు
ఏపీ జూడాల పిలుపు
కడప అర్బన్: ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీజూడా) రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్ రెసిడెంట్లు, సీనియర్ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, హౌస్ సర్జన్లకు 2026 జనవరి 1 నుంచి అమలు కావాల్సిన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న స్టైపెండ్ పెంపును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మెలో భాగంగా ఆగస్టు 4, 5 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఓపీ సేవలు అందుతాయన్నారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఆగస్టు 6 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో సాధారణ ఓపీ సేవలను పూర్తిగా బహిష్కరిస్తామని ఏపీజూడా ప్రకటించింది.ఈమేరకు ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీజూడా) అ ధ్యక్షుడు డాక్టర్ యు. ఈశ్వర్ శంకర్ ఉపాధ ్యక్షులు డాక్టర్ జి. భార్గవ సాయి నాయుడు, శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మెగా పీటీఎంలో డీఈఓ వివాదాస్పద వ్యాఖ్యలు
చింతకొమ్మదిన్నె : వైఎస్సార్ కడప జిల్లా చింతకొమ్మదిదిన్నె మండలంలో పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికై న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పీటీఎం సమావేశంలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి షంషుద్దీన్ వివాదాస్పద వాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 2024 మార్చిలో విద్య మీద, విద్యార్థుల మీద ఒక సర్వే జరిగిందని, ఆ సర్వేలో ఏపీ విద్యార్థులు చీకటిలో ఉన్నారని, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే సాకర్యాలు లేవని, అటువంటి చీకటి నుంచి 2024 జూన్లో రాష్ట్రానికి వెలుగు వచ్చిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వెలుగే రాష్ట్ర ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి.. వారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం విద్యా సంస్కరణలు చేపట్టిందని తెలియజేశారు. కాగా డీఈఓ మాట్లాడుతున్న సభా ప్రాంగణంలో ఎదురుగానే ప్లస్ టూ కోసం నిర్మించిన రెండతస్తుల అదనపు భవన నిర్మాణాలు రెండేళ్లుగా అసంపూర్తిగా ఉంది. విద్యా శాఖ మంత్రి లోకేష్ ఇదే ప్రాంగణంలో పర్యటించినప్పుడు, నేడు అలాగే ఉన్న విషయాలు డీఈఓ మరచిపోవడం, మండల పరిధిలోని పాఠశాలల్లో సమస్యలను మరచి కేవలం అధికార పార్టీల ప్రాపకం కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలువురు తల్లిదండ్రులు , ప్రజలు విమర్శిస్తున్నారు.


