రాజంపేట : జిల్లా వ్యాప్తంగా రాజంపేటలో సంచలనం రేపిన చిట్టీల వ్యాపారి కంచి నాగేంద్ర వర్మ కోట్ల రూపాయిలు బాకీ వెనుక గూడుపుఠాణి దాగి ఉందనే అనుమానాలు సర్వత్రా రేకిత్తిస్తున్నాయి. తొలుత ఐసీఐసీఎస్ బ్యాంక్లో బీమా విభాగంలో పనిచేసిన ఈయన జనం దగ్గర డబ్బులు కాజేయాలని వివిధ రకాల పన్నాగాలతో వ్యూహం తెరపైకి తెచ్చాడని తెలుస్తోంది. మోసపూరిత విధానాలతో ఇప్పుడు రూ.50 కోట్లకు పైగా అక్రమ సంపాదనను సమకూర్చుకున్నాడు. ఈ మాయమాటల గారిడితో మోసపోయిన బాధితుడు ఒకరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో నాగేంద్రవర్మ మోసపూరిత ఆర్ధికలావాదేవీలు ఒకొక్కటిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. జాబితా సేకరణలో పట్టణ పోలీసులు నిమగ్నమయ్యా రని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే గూడుపుఠాణి బయటికి వస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు.
టీడీపీ నేత సహకారం? ..
నాగేంద్ర వర్మకు పట్టణంలో టీడీపీ నేతగా వున్న వడ్డీ వ్యాపారితో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇతని వల్లనే ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేసేందుకు అవకాశం కలిగిందని టీడీపీ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. ఆయన ఇంటిలో జనానికి నాగేంద్ర పెట్టిన కుచ్చుటోపికి సంబంధించి బంగారం, వెండి రూ.కోట్లాది నగదు ఉందని టీడీపీ వర్గాల్లోనే జోరుగా ప్రచారం జరుగుతోంది. వెలుగులోకి వచ్చిన ఈ ఆర్ధికనేర వ్యవహారంలో ఇతని సహకారం ఉందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా.. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిగేనా అన్న అనుమానాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇంత పెద్ద ఎత్తున ఒక సామాన్యుడు రూ.50 కోట్లకుపైగా నగదు లావాదేవీలు జరిపాడంటే ఎవరి ప్రోత్సాహం ఉందనే అంశాలపై అనేక అనుమానాలు రాజంపేట వాసులలో కలుగుతోంది. ఆదాయపన్ను శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెలువడుతున్నాయి.
నాగేంద్రవర్మకు సహకరించినది ఎవరు..?
నిష్పక్షపాతంగా పోలీసు విచారణ జరిగేనా?
మోసానికి గురైన బాధితులకు
న్యాయం జరిగేనా
రూ.కోట్లాది మార్పిడిపై ఐటీ దాడులు ఏవీ..


