రాజంపేట : రాజంపేటలో చిట్టీల వ్యాపారి చేసే కంచి నాగేంద్ర వర్మ ప్రజలకు కుచ్చుటోపీ పెట్టాడు. అధికార పార్టీకి చెందిన నేతను అడ్డుపెట్టుకుని మోసం చేశా డు. వేలు, లక్షలు కాదు.. ఏకంగా కోట్ల రూపాయలకు స్కెచ్ వేశాడు. బాధితుడు ధనుజంయ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో.. కంచి నాగేంద్రవర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి బాధితులు ఒక్కొక్కరుగా పోలీస్స్టేషన్కు రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే..
రాజంపేట పట్టణం ఎల్లాగడ్డ గ్రామానికి చెందిన కంచి నాగేంద్రవర్మ కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు. రాజంపేటతోపాటు రైల్వేకోడూరు ప్రాంతంలోనూ చిట్టీలు వేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో 50 కోట్లకు పైగా చిట్టీలు వేసినట్లు తెలుస్తోంది. ప్రారంభంలో నమ్మకస్తుడిగా వ్యవహరించిన నాగేంద్రవర్మ కొన్ని రోజులుగా తన శైలి మార్చుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతల అండ చూసుకుని కుచ్చుటోపీకి ఎత్తుగడ వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సుమారు 70 లక్షల రూపాయలు మోసపోయానని గ్రహించిన ధనంజయ అనే వ్యక్తి రెండు రోజుల కిందట ఎస్పీ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును పరిశీలించిన ఎస్పీ రాజంపేట అర్బన్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. దీంతో నాగేంద్ర వర్మ మోసం చేశాడన్న విషయం తెలిసి బాధితులు.. ఒక్కొక్కరిగా రాజంపేట అర్బన్ స్టేషన్కు తరలిరావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు స్టేషన్లో బాధితుల పంచాయితీ ఉదయం కొనసాగుతూనూ వచ్చింది. నాగేంద్రవర్మ బాధితులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని కోట్ల రూపాయిలు బాకీ అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. సుమారు రూ.50 కోట్ల వరకు చిట్టీల లావాదేవీలు జరిపినట్లుగా సమాచారం వస్తోంది. ఈ విషయమై సీఐ నాగార్జునను వివరణ కోరగా నాగేంద్రను విచారణ చేస్తున్నామని తెలిపారు.
టీడీపీ ఇన్చార్జిపై ఆరోపణలు చేసిన బాధితుడు
పోలీసుస్టేషన్లో ఉన్న చిట్టీల వ్యాపారి విషయంలో బాధితుడు జాఫర్ అనే వ్యక్తి పీఎస్ వద్ద టీడీపీ ఇన్చార్జి జగన్మోహన్రాజుపై ఆరోపణలు చేశారు. నాగేంద్రవర్మకు అతని అండ ఉందని తెలిపాడు. కొంత సేపు గడిచాక తిరిగి తనకు తెలియదంటూ, ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన వెంకట్ అనే వ్యక్తి చెప్పమంటే చెప్పానంటూ ప్లేటు ఫిరాయించడం గమనార్హం.
స్టేషన్లోకి దూసుకొచ్చిన పచ్చమూకలు
టీడీపీ నేతపై ఆరోపణలు చేసిన జాఫర్పై పచ్చమూకలు దౌర్జన్యం చేయడానికి రాజంపేట పట్టణ పోలీసు స్టేషన్కు తరలిరావడంతో మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో బాధితునికి, ముఖ్య నేత వర్గీయులకు మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల సాక్షిగా టీడీపీ నాయకులు దూషణపర్వం కొనసాగించారు. దాదాపు 20 మందికిపైగా పచ్చమూకలు స్టేషన్ ఎదుట వీరంగం సృష్టించారు.
రాజంపేటలో సంచలనంగా మారిన వ్యవహారం
పోలీసుల అదుపులో చిట్టీల వ్యాపారి నాగేంద్ర
స్టేషన్కు తరలివచ్చిన బాధితులు
ఉదయం నుంచి రాత్రి వరకు
ఠాణా వద్ద ఉద్రిక్తత
స్టేషన్లోకి దూసుకొచ్చిన పచ్చమూకలు


