కడప ఎడ్యుకేషన్ : విద్యార్థుల్లో మాతృభాష అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎమ్మెల్సీ యం.వి రామచంద్రారెడ్డి కోరారు. అపుస్మా కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప నాగార్జున మోడల్ స్కూల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘తెలుగు భాష ప్రపంచ రికార్డు’లక్ష్యంతో కూడిన రెండు రోజుల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణలో వాగ్దేవి బిరుదాంకితుడు భాస్కర్ రాజు, వారి కుమార్తె అశ్విని ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తెలుగు భాషను విద్యార్థులకు సులభతరంగా, ఆసక్తికరంగా బోధించే పద్ధతులతోపాటు తెలుగు భాష ప్రపంచ రికార్డు కార్యక్రమం గురించి ఉపాధ్యాయులకు సమగ్ర అవగాహన కల్పించారు. ముగింపు సభకు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలుగు భాష పరిరక్షణ, ప్రాచుర్యం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. విద్యార్థుల్లో మాతృభాష పట్ల ప్రేమాభిమానాలు పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన నిర్వాహకులు, పాఠశాల యాజమాన్యాలు, అతిథులను అభినందించారు. తెలుగు భాషకు ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అపుస్మా జిల్లా కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో అపుస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.వి రమణారెడ్డి, అపుస్మా కడప జిల్లా అధ్యక్షుడు బి.గంగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటసుబ్బయ్య, జనరల్ సెక్రటరీ శివశంకర్రెడ్డి, ట్రెజరర్ నాగసుబ్బారెడ్డి, కడప సిటీ అధ్యక్షురాలు మైథిలి, జనరల్ సెక్రటరీ డాక్టర్ పద్మనాభరెడ్డి, అపుస్మా జిల్లా నాయకులు రామక్రిష్ణారెడ్డి, రమణారెడ్డి, నిర్మల, షహనాజ్ బేగంతోపాటు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి


