కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 191 ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే జిల్లా ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీంతోపాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్ అందజేత
వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్ అందజేశారు.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, పులివెందుల ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 120 మంది పోలీస్ సిబ్బందికి హ్యాట్స్, చలువ కళ్లద్దాలు, మాస్క్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్తో కూడిన సమ్మర్ కిట్స్ను కడప నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఇన్చార్జ్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి, స్పెషల్బ్రాంచ్ సీఐ సదాశివయ్య, ట్రాఫిక్ సీఐ మర్రి తులసీరామ్, ట్రాఫిక్ ఎస్ఐలు నారాయణ, నాగరాజు, సిద్దయ్య, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ తదితరులు పాల్గొన్నారు.


