● మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకే ఈ వినూత్న ప్రాజెక్టుకుర శీకారం: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
● ప్రాజెక్టు విజయవంతంపై రైతుల హర్షం
లింగాల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతోనే మండలంలోని గుణకనపల్లెలో రీచార్జ్ బోర్ల ప్రాజెక్టును ప్రారంభించామని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. లింగాల మండలం గుణకనపల్లె గ్రామంలో ఆదివారం భూగర్భ జలాలను పెంపొందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుణకనపల్లె గ్రామానికి కృష్ణా జలాలను తరలించేందుకు సుమారు రూ. 5 కోట్ల నిధులు వెచ్చించారన్నారు. దీంతో ప్రత్యేక పంపుహౌస్, మోటార్లు, పైపులైన్ పూర్తి చేశామన్నారు. సుమారు 100 మీటర్ల మేర అక్కడి రైతులు భూ సేకరణకు అంగీకరించకపోవడంతో పనులు ఆగిపోయాయన్నారు. తాజాగా తమ గ్రామానికి కృష్ణా జలాలను తరలించాలని అక్కడి ప్రజలు, రైతులు, కుడికాలువ అధికారులు కోరడంతో ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామని ఎంపీ తెలిపారు. ఆయన ఆదేశాలతో సుమారు రూ. 15 లక్షల ఎంపీ నిధులను వెచ్చించి వంద మీటర్ల పైపులైన్ ఏర్పాటుతోపాటు ఐదు బోరుబావులను తవ్వించామని వెల్లడించారు. బోరు బావులకు ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేసి కృష్ణా జలాలను బోరు బావుల్లోకి పంపించా మని వివరించారు. బోరు బావుల్లో సుమారు 20–30 అడుగుల సొరంగమార్గాలు ఏర్పడ్డాయని, పొడవు కిలోమీటర్ల మేర ఉండవచ్చన్నారు. ఈ బోరు బావుల్లోకి పంపిస్తున్న కృష్ణా జలాలు సొరంగ మార్గాల ద్వారా వెళ్లి పరిసర ప్రాంతాలు, గ్రామా ల్లోని రైతుల బోరు బావుల్లో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని వివరించారు. చిత్రావతి నుంచి పాపాగ్ని నది వరకు భూగర్భంలో ఉన్న సొరంగ మార్గాలలో 120 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోవచ్చని ఆయన తెలియజేశారు. ఇలాంటి వినూత్న కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా జరగలేదన్నారు. ప్రస్తుతం నాలుగు రోజులుగా కృష్ణా జలాలు బోరు బావుల ద్వారా సొరంగ మార్గాల్లో వెళుతుండడంతో గుణకనపల్లె, రామట్లపల్లె గ్రామాలలో భూగర్భజలాలు పెరిగాయని అక్కడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇలాంటి కొత్త ప్రాజెక్టుకు జీవం పోసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, నీటిపారుదలశాఖ అధికారులు, రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ చైతన్యరెడ్డి, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ బాబురెడ్డి, పులివెందుల నియోజకవర్గ రైతు విభాగ కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మునీశ్వర్రెడ్డి, శేఖర్రెడ్డి, నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, కొండారెడ్డి, మునిరెడ్డి, గోపాల్రెడ్డి, హర్షవర్దన్రెడ్డి, మునికిట్ట, ప్రతాపుడు, గూడు సాహెబ్, రఫీ, బాబా హుసేన్, గంగాదర్రెడ్డి, రవి, మండల వైఎస్సార్ సీపీ నాయకులు మల్లికార్జునరెడ్డి, ఏవీ శ్రీనివాసరెడ్డి, జగన్మోహన్రెడ్డి, శ్రీను, శ్రీనివాసరెడ్డి, గోపాల్రెడ్డి, మోహన్రెడ్డి, రఘునాథరెడ్డి,మండలంలోని వివిధ గ్రామా ల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.


