కడప సెవెన్రోడ్స్ : జనాభా గణనలో భాగంగా మొదటి దశలో చేపట్టిన ఇళ్ల జాబితా, గణన కార్యక్రమం శుక్రవారం ముగిసింది. మే 1 నుంచి 30వ తేదీ వరకు ఈ గణన నిర్వహించాలని తొలుత ఉత్తర్వులు వచ్చాయి. అయితే, తక్కువ సమయంలో వంద శాతం లక్ష్యాలు పూర్తయ్యే పరిస్థితి కనిపించలేదు. దీంతో ఈనెల 5వ తేదీ వరకు ఇళ్ల జాబితా, గణనను పొడిగించారు. జిల్లాలో మొత్తం 7,15,736 ఇళ్లను గణన చేశారు. అందులో 96,503 (13.48 శాతం) ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఇక తాళాలు వేసిన ఇళ్లు 1202 గుర్తించారు. జిల్లాలోని 616 గ్రామాలు, 8 పట్టణాలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్లలో 4421 మంది ఎన్యుమరేటర్లు, 773 సూపర్వైజర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రెండవ దశలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 28వ తేదీ వరకు జనాభాను లెక్కిస్తారు.
గండికోటలో
రణబాలి చిత్రీకరణ పూర్తి
జమ్మలమడుగు : గండికోటలో రణబాలి చిత్రీకరణ పూర్తయింది. గత నెల 31న ప్రారంభమైన చిత్రీకరణలో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందనపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. కోట ముఖద్వారం నుంచి హీరో విజయ్దేవరకొండ గుర్రాలపై తన అనుచరులతో లోపలికి వెళ్లే సన్నివేశాలతో పాటు, హీరోయిన్ రష్మిక మందనతో కలిసి మాధవరాయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సన్నివేశాలను చిత్రీకరించారు. శుక్రవారం చిత్రీకరణ పూర్తి కావడంతో హీరో, హీరోయిన్లు, టెక్నిషియన్లు ప్యాకప్ చేసుకుని సాయంత్రం గండికోట నుంచి వెళ్లిపోయారు.


