నివేదిక పంపించాం
● ఏడాదైనా ప్రతిపాదన దశలోనే
● జిల్లా వ్యాప్తంగా
3500 మంది ఎదురుచూపు
జమ్మలమడుగు : మహిళలకు చేతి వృత్తులు నేర్పించి ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఈ దిశగా డ్వాక్రా మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి, తర్వాత మిషన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో మహిళలు కుట్టు శిక్షణ కేంద్రానికి భారీగా క్యూ కట్టారు. శిక్షణ పూర్తయి ఏడాదమవుతున్నా మిషన్లు పంపిణీ చేయకపోవడంతో.. వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 24 కేంద్రాల్లో..
మహిళలకు కుట్టు శిక్షణలో మెలకువలు, ఆధునిక సమాజంలో నూతన డిజైన్లు నేర్పిస్తామని చెప్పిన బీసీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 24 కేంద్రాలు ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీ, మండల పరిధిలో ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యులకు 2025 ఏప్రిల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్యాలయం, మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో కుట్టు శిక్షణ నేర్పించారు. కేంద్రాలు దూరంగా ఉన్నా ఆటోలకు చార్జీలు పెట్టుకుని మహిళలు శిక్షణ నేర్చుకున్నారు. శిక్షణ తర్వాత కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామన్న అధికారులు.. తిరిగి పరీక్షలు నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే ఇస్తామని ప్రకటించారు. పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఉత్తీర్ణత సాధించిన వారికి ఏడాది అవుతున్నా ఇంత వరకు కుట్టుమిషన్లు రాలేదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 3500 మంది మహిళలు కుట్టు శిక్షణ నేర్చుకున్నారు. వారందరికీ బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినా ఇంత వరకు నెరవేర్చలేదు. పైగా అధికారులు మాత్రం ఇంకా ప్రతిపాదనలు పెట్టామని సర్దేసుకుంటున్నారు. అసలు మిషన్లు పంపిణీ అవుతాయా లేదా అనే అనుమానాలు మహిళలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా కుట్టు శిక్షణ పొందిన మహిళల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించాం. వారు మంజూరు చేసిన తర్వాత కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాం.
– జయసింహా, బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారి


