ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఎంతో కాలం నుంచి మహిళ అండాశయంలో ఉన్న భారీ కణితిని జిల్లా ఆస్పత్రి వైద్య బృందం తొలగించారు. ప్రొద్దుటూరులోని ఈశ్వర్రెడ్డి నగర్కు చెందిన రామలక్ష్మి కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఆమెను కుటుంబ సభ్యులు ఇటీవల ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె అండాశయంలో భారీ సైజులో గడ్డలు (కణితి) ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్బాబు ఆధ్వర్యంలో గురువారం ఆస్పత్రి వైద్యులు సాగర్ కుమారి, కావ్య, గోపినాథ్లు క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి గడ్డలను సురక్షితంగా తొలగించారు. శస్త్ర చికిత్స అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిలకడగా ఉందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఇంత పరిమాణంలో గడ్డలు అరుదుగా ఉంటాయని చెప్పారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆనంద్బాబు చికిత్సలో పాల్గొన్న వైద్యులను అభినందించారు.
మహిళ అండాశయం నుంచి
భారీ కణితి తొలగింపు


