మృతి చెందిన మదన గోపాల్, వనిపెంట సుమంత్
నడక కోసం గుమ్మం దాటిన ఆ అడుగులు గమ్యం చేరకనే ఆగిపోయాయి..
వందేళ్లు సాగాల్సిన ఆ యువకుల బతుకులు మధ్యలోనే తెలవారిపోయాయి..
తెల్లారకముందే వారి కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి..
ఒక్క క్షణం.. ఒకే ఒక్క క్షణం..
దారి కాచిన మృత్యువు రాకాసిలా దూసుకొచ్చింది..
చూస్తుండగానే ప్రాణాల్ని గాల్లో కలిపేసింది..
అంతే.. వారి నడక శాశ్వతంగా ఆగింది..
మైదుకూరు మండలం.. జీవీ సత్రం వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
ఓ కుటుంబంలో చెట్టంత కొడుకును తన ఒడిలోకి చేర్చుకున్న మృత్యువు తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది.. మరో కుటుంబంలో పెళ్లయిన ఆర్నెళ్లకే భర్తను దూరం చేసి భార్యకు చేదు జ్ఞాపకాన్నిచ్చింది..
● జీవీ సత్రం సమీపంలో బుధవారం ఉదయం వాకింగ్ చేస్తున్న ముగ్గురు యువకులపై బొలెరో పికప్ వ్యాన్ దూసుకెళ్లిన సంఘటనలో వనిపెంట సుమంత్(24), కుంభగిరి మదన గోపాల్(25) అనే యువకులు మృతి చెందారు. మరో యువకుడు సామల విజయ నరసింహ తీవ్రంగా గాయపడ్డాడు. సుమంత్ బీటెక్ చదివి ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకున్న అతను ముంబై నుంచి 20 రోజుల కిందట ఇంటికి వచ్చాడు. మదన గోపాల్ జీవీ సత్రంలోనే సెలూన్ పెట్టుకుని తల్లిదండ్రులకు ఆసరాగా ఉన్నాడు. ఆర్నెళ్ల కిందట ఇతనికి వివాహమైంది. మరో యువకుడు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చనిపోయిన ఇద్దరూ బంధు వు లే కావడంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. –మైదుకూరు


