రాజంపేట: జిల్లా కేంద్రం కడప నుంచి ఐటీ రాజధాని బెంగళూరుకు రైలు ప్రయాణం చేయాలన్న జిల్లా వాసుల ఆకాంక్ష దశాబ్దాలుగా అపరిష్కృతంగానే మిగిలిపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కడప–బెంగళూరు మధ్య నేరుగా రైలు మార్గం పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ, అది నేటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఫలితంగా వేలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు నిత్యం ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీకి గురవుతూ, భారీ వ్యయంతో బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది.
పరిష్కారం ఉన్నా పట్టించుకోరా?
జిల్లా వాసుల ఇబ్బందులకు మైసూరు–రేణిగుంట సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (22135/22136) పొడిగింపు రూపంలో ఒక చక్కని పరిష్కారం కనిపిస్తోంది. ప్రస్తుతం వారానికి ఒకసారి నడుస్తున్న ఈ రైలు శనివారం ఉదయం 8 గంటలకే రేణిగుంట చేరుకుని, తిరిగి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఖాళీగా (స్టేబుల్) ఉంటోంది. ఈ తొమ్మిది గంటల విరామ సమయంలో రైలును లైనుపై నిలపడం వల్ల ఇతర రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగడమే కాకుండా, ప్లాట్ఫారమ్ రద్దీ పెరిగి అనేక రైళ్లు ఔటర్లో ఆగాల్సిన దుస్థితి నెలకొంది. అదే సమయంలో ఈ రైలును కడప వరకు నడిపితే లైను రద్దీ తగ్గడమే కాకుండా, జిల్లా వాసులకు వారంతంలో బెంగళూరు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. దీనికి కడప, నందలూరు, రాజంపేట, కోడూరు స్టేషన్లలో హాల్టింగ్ కల్పిస్తే వేలాది మందికి లబ్ధి చేకూరుతుంది.
అటకెక్కిన పాత మార్గం..
అంతుచిక్కని కొత్త లైను:
కడప–బెంగళూరు రైలు మార్గానికి 2008–09 బడ్జెట్లో ఆమోదం లభించింది. 2010లో రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభమైనా, వైఎస్సార్ మరణం తర్వాత అవి పెండ్లిమర్రి వద్దే ఆగిపోయాయి. మరోవైపు 2020లో రూ.2,505 కోట్ల అంచనా వ్యయంతో ముద్దనూరు–ముదిగుబ్బ కొత్త లైనును తెరపైకి తెచ్చినా, అది కాగితాలకే పరిమితమైంది. పొరుగు జిల్లాల నుంచి బెంగళూరుకు అనేక రైళ్లు ఉన్నా, కడప జిల్లా పట్ల రైల్వే అధికారులు చూపుతున్న వివక్షపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.
బెంగళూరుకు పట్టాలెక్కని కల..
కడపకు రైల్వే శాఖ మొండిచెయ్యి!
దశాబ్దాల నాటి డిమాండ్.. అటకెక్కిన వైఎస్సార్ హయాం నాటి ప్రాజెక్టు
మైసూరు ఎక్స్ప్రెస్ను పొడిగిస్తే తీరనున్న జిల్లా వాసుల ఇబ్బందులు
రేణిగుంటలో రైలు ‘విశ్రాంతి’..
జిల్లా ప్రయాణికులకు ‘అశాంతి’


