అంబటిపై హత్యాయత్నం అమానుషం
రాజంపేట : కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ రౌడీమూకలు హత్యయత్నానికి పాల్పడటం అమానుషమని, అంబటికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసన సభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆకేపాడులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనిల్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి నేతృత్వంలో రౌడీమూకలు అంబటి ఇల్లు, కార్యాలయం దాడి చేయడం అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకొని చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి, తిరిగి వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేయడం చూస్తుంటే రాష్ట్రంలో రాక్షస పాలన గుర్తుకొస్తోందన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాక్షసం కొనసాగుతోందన్నారు. రెడ్బుక్కు పోయేకాలం వచ్చిందన్నారు. అంబటి ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనకు తక్షణమే భద్రత కల్పించాలన్నారు. చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు ఏ వ్యాఖ్యలు చేయకపోయినా, ఒక పథకం ప్రకారం టీడీపీ రౌడీమూకలు దాడికి పాల్పడటం వెనుక టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే జరిగిందనే అనుమానాలు ఉన్నాయన్నారు.టీడీపీ రౌడీమూకలపై కేసులు నమోదు చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంపద సృష్టించే మాట అటుంచి, ప్రస్తుతానికి ఆటవిక రాజ్యం సృషించారన్నారు. అంబటి ప్రశ్నించేందుకు హతమార్చే కుట్ర జరిగిందన్నారు. అసత్యాలతో ఎదురుదాడి జరిగిందన్నారు. సరికొత్త డైవర్షన్ డ్రామాలో భాగంగానే కాపునేత అంబటిపై దాడి జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు. కాపులను అణిచివేయడమే లక్ష్యంగా అంబటి పై హత్యయత్నంకు పాల్పడినట్లుగా ఇప్పటికే కాపువర్గాలు మండిపడుతున్నాయన్నారు. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు తప్పుడు ప్రచారానికి పరిహారంగా ఆకేపాడు గ్రామంలో వెంకటేశ్వర స్వామికి పూజలు చేశారు. ఎమ్మెల్యే పార్టీ అమరనాథరెడ్డి టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఆకేపాటి అనిల్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు దొడ్డిపల్లె భాస్కర్రాజు, నడివీధి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి


