
దారిమళ్లిన నాంధేడ్ వీక్లీ!
● ఉత్తరతెలంగాణాకు రైలు కనెక్టివిటీ
● మదనపల్లె, పీలేరులోహాల్టింగ్ సదుపాయం
రాజంపేట: ప్రస్తుతం నాంధేడ్ నుంచి ధర్మవరం మధ్య నడుస్తున్న (07189/17190) వీక్లీ ప్రత్యేక రైలు దారిమళ్లనుంది. ఈ రైలు ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి, చర్లపల్లె, నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల, వినుకొండ, నంద్యాల, ఎర్రగుంట్ల , కడప , తిరుపతి, పాకాల మార్గాల్లో నడిచేది. వచ్చే నెల నుంచి ఈ రైలు నిజమాబాద్, పెద్దపల్లె, వరంగల్ , విజయవాడ, గుడూరు, తిరుపతి, పాకాల మీదుగా నడపనున్నారు.
● మొదటిసారిగా పీలేరు, మదనపల్లె, కదిరి నుంచి ఉత్తర తెలంగాణాలోని జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లె, వరంగల్తో పాటు ఖమ్మం జిల్లాకు కూడా అనుసంధానం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి పీలేరు, కలికిరి , మదనపల్లె, కదిరి వెళ్లడానికి నేరుగా సౌకర్యం లేదు. ఇప్పుడు ఈ ప్రత్యేకరైలుతో తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, వికరాబాదు, గద్వాల ప్రాంతాలలో ఇప్పటికే మదనపల్లె, పీలేరు, కలికిరి అనుసంధానమై ఉన్నాయి.
● నాంధేడ్ ప్రత్యేక రైలుతో ఉత్తర తెలంగాణాతో మదనపల్లె , పీలేరుకు రైలుసౌకర్యం లభించినట్లైంది. సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఎగువమార్గంలో నాలుగుట్రిప్లు, 07190 నంబరుతో ధర్మవరం నుంచి నాంధేడ్ ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్రైలు వయా మదనపల్లె, పీలేరు, పాకాల, తిరుపతి, గూడూరు, విజయవాడ,వరంగల్, పెద్దపల్లె, కరీంనగర్, నిజామాబాద్ మీదుగా నడవనుంది.
రైలునడిచేదిలా..
● నాంధేడ్ నుంచి ధర్మవరం వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్రైలు 07189 నంబరుతో 5, 12, 19, 26 తేదీల్లో నాంధేడ్లో సాయంత్రం 4.30గంటలకు బయలుదేరి, మరుసటిరోజు సాయంత్రం ధర్మవరం జంక్షన్కు 5గంటలకు చేరుకుంటుంది. అన్నమయ్య జిల్లాలో పీలేరు, మదనపల్లెరోడ్లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు.
● 07190 నంబరు గలం నాంధేడ్ ప్రత్యేకరైలు(వయా తిరుపతి–విజయవాడ–పెద్దపల్లి)మీదుగా వెళ్లేటప్పుడు ఆదివారం ఉదయం మదనపల్లెరోడ్డు నుంచి 7.30గంటలకు, పీలేరు నుంచి 8.30 నిమిషాలకు బయలుదేరుతుంది.
● 07189 నాంధేడ్ నుంచి ధర్మవరం వీక్లీ ప్రత్యేకరైలు శనివారం మధ్యాహ్నం పీలేరులో 12.30 నిమిషాలకు, మదనపల్లె రోడ్ 1.15 నిమిషాలకు బయలుదేరేలా టైమింగ్స్ను ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఈ రైలుకు సంబంధించి ఐఆర్టీఎస్ పోర్టల్లో బుకింగ్ సౌకర్యం ప్రారంభమైంది.