
మిస్సింగ్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత
● వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు
● క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ నిరోధంపై ప్రత్యేక దృష్టి
● బైకులపై ఓవర్ స్పీడ్, సైలెన్సర్ మార్చి తిరిగే వారు, స్టంట్స్ చేసేవారికి దండన
● నేరసమీక్షా సమావేశంలో
జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్
కడప అర్బన్ : మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక ప్రాధాన్యతతో కేసులను ఛేదించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ ఆదేశించారు. బుధవారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిస్సింగ్ కేసులను ఛేందించేందు కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలు, బాలికలపై నేరాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న మహిళల పట్ల జరిగిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని, కళాశాలలు, పాఠశాలల వద్ద శక్తి టీముల ద్వారా ఈవ్ టీజింగ్ జరగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. డ్రోన్ కెమెరా ద్వారా నిఘా ఉంచాలని ఈవ్ టీజింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలైన క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మట్కా జిల్లాలో ఎక్కడా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సైబర్ క్రైమ్, సోషల్ మీడియా కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలను చైతన్య పరుస్తూ విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ కార్యక్రమం లో భాగంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తులు, గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలపై సమీప దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు ముమ్మరం చేయాలన్నారు. గంజాయి సేవించే అవకాశం ఉన్న శివారు ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెంచాలని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. బైకులపై ఓవర్ స్పీడ్, సైలెన్సర్ మార్చి తిరిగే వారు, ప్రమాదకర స్టంట్స్ చేసే ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుని, కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్న్ నిర్వహించాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న పలు కేసులపై నిశితంగా సమీక్ష జరిపి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. డాబాలు, హోటళ్లు, లాడ్జిలు, బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్ లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా పగలు, రాత్రి గస్తీని పెంచాలని ఆదేశించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, మరోమారు నేరాలకు పాల్పడకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్.పి(పరిపాలన) కె.ప్రకాష్ బాబు , స్పెషల్ బ్రాంచ్,కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, డీటీసీ డీఎస్పీలు సుధాకర్, ఎ.వెంకటేశ్వర్లు, పి.భావన, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర రావు, మురళి నాయక్, అబ్దుల్ కరీం, జిల్లాలోని సీఐలు, కడప సబ్ డివిజన్లోని ఎస్ఐలు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.

మిస్సింగ్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత