కడప కోటిరెడ్డిసర్కిల్: విజయవాడ కీట్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు డీడీయూ జీకేవై కార్యక్రమం ద్వారా వివిధ సాఫ్ట్వేర్ కోర్సులతోపాటు జూనియర్ సాఫ్ట్వేర్ వెబ్ డెవలపర్ కోర్సులో ఆరు నెలలపాటు ఉచిత శిక్షణ, భోజన వసతి సౌకర్యం కల్పిస్తామని సంస్థ అడ్మిషన్ కో ఆర్డినేటర్ హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ కేంద్రంలో ఇచ్చే శిక్షణలో ప్రతి విద్యార్థికి సీ, సీ++, జావా స్క్రిప్ట్, పైథాన్, వెబ్ డిజైనింగ్, జేఎస్డీ కోర్సులతోపాటు స్పోకన్ ఇంగ్లీషు, కంప్యూటర్ లైఫ్ స్కిల్స్లో శిక్షణ ఇస్తామని వివరించారు.అభ్యర్థులు 20–30 ఏళ్లలోపు కలిగి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కోర్సులో చేసి ఉండాలన్నారు. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 90004 87423 నెంబరులో సంప్రదించాలన్నారు.
మే 10న జాతీయ లోక్ అదాలత్
కడప అర్బన్: జాతీయ న్యాయసేవాధికారసంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికారసంస్థ ఆదేశానుసారం జిల్లా న్యాయసేవాధికారసంస్థ వారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మే 10వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు 08562 258622, 244622 నంబర్లో సంప్రదించాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. అలాగే కడప.డీకోర్ట్స్.జీఓవి.ఇన్, డిఎల్ఎస్ఏకేడిపి అట్దిడేటాఫ్ జి మెయిల్.కంలోనూ సంప్రదించవచ్చని వివరించారు.కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నేటి నుంచి పెంచలకోనకు ప్రత్యేక సర్వీసు
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనకు శుక్రవారం నుంచి రాజంపేట డిపోకు చెందిన ప్రత్యేక సర్వీసును నడపనున్నట్లు ఆర్టీసీ రాజంపేట డిపో మేనేజర్ రమణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సు ఉదయం 5.15 గంటలకు రాజంపేటలో బయలుదేరి 6.30 గంటలకు కడప బస్టాండుకు చేరుతుందని పేర్కొన్నారు. అనంతరం 6.40 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి రాజంపేట, చిట్వేలి, రాపూరు మీదుగా ఉదయం 10.45 గంటలకు పెంచలకోనకు చేరుతుందని వివరించారు. తిరిగి 11.15 గంటలకు పెంచలకోనలో ఇదే మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు రాజంపేటకు చేరుతుందని వివరించారు. తిరిగి 2.15 గంటలకు రాజంపేటలో బయలుదేరి రాపూరు కు 3.45 గంటలకు చేరుకోవడం జరుగుతుందని వివరించారు. 4.00 గంటలకు రాపూరులో బయలుదేరి చిట్వేలి, రాజంపేట మీదుగా కడపకు రాత్రి 7 గంటలకు చేరుకుంటుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
పండ్ల మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనివ్వాలి
ఒంటిమిట్ట: పండ్ల మొక్కల పెంపకానికి ప్రాధా న్యం ఇవ్వాలని సుస్థిర వ్యవసాయ సంస్థ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ రవితేజ పేర్కొన్నారు. గురువారం ఒంటిమిట్ట రైతు సేవా కేంద్రంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం సిట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ యాజమాన్య పద్ధతుల ద్వారా పండ్ల మొక్కల పెంపకంపై రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఒంటిమిట్ట, సుండుపల్లి, ఓబులవారిపల్లి మండలాలకు చెందిన రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. మొక్కల పెరుగుదలకు పురుగులు, తెగుళ్లు నివారణకు పాటించాల్సిన సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి రవితేజ వివరించారు.
మొక్కల ఎంపిక, నాటే విధానం, కొమ్మల కత్తిరింపు, నీటి యాజమాన్య పద్ధతుల గురించి సుస్థిర వ్యవసాయ సంస్థ ఆర్డబ్ల్యూఐ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ విద్యాసాగర్ వివరించారు.అలాగే మొక్కలు ఇచ్చిన పది మంది రైతులకు నవధాన్య కిట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఫ్పీఓ సోషల్ మొబులైజర్ ఓబులేశు, ఏకశిలా ఎఫ్పీఓ చైర్మన్ సుబ్బరాయుడు, సుస్థిర వ్యవసాయ సంస్థ న్యాచురల్ ఫార్మింగ్ కో–ఆర్డినేటర్ అనుషా, ఎఫ్పీఓ మౌనిక తదితరులు పాల్గొన్నారు.