కడప రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కడప రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Sep 25 2023 1:34 AM | Updated on Sep 25 2023 12:53 PM

- - Sakshi

చింతకొమ్మదిన్నె/కడప అర్బన్‌ : చింతకొమ్మదిన్నె పోలీస్‌స్టేషన్‌ పైభాగాన ఉన్న కడప రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ విజయ్‌ రాముడు (39)(పీసీ నంబర్‌:2876) ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య భానుశ్రీ ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. 2011 బ్యాచ్‌కు చెందిన విజయ్‌రాముడు జిల్లాలోని పలు పోలీ స్‌స్టేషన్‌లలో పనిచేశాడు. కడపలోని అక్కాయపల్లిలో నివాసం ఉండేవాడు. చెన్నూరు పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ డిప్యుటేషన్‌పై కడప రూరల్‌ సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఒంటిమిట్ట పోలీస్‌ స్టేషన్‌లో పని చేస్తుండగా సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఆ సమయంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడు.

తరువాత సస్పెన్షన్‌ ఎత్తివేయగా విధుల్లో చేరాడు. అంతేగాక అతని తండ్రి అయోధ్యరాముడు తాను సంపాదించిన స్థిరాస్థులను తన కుమారుడికి ఇవ్వకుండా, కుమార్తెలకే ఇచ్చాడు. తద్వారా కుటుంబంలో మనస్ఫర్థలు ఏర్పడి, తీవ్రమానసిక ఆవేదనకు గురయ్యాడు. ఇతనికి భార్య భానుశ్రీ, కుమారుడు హర్షిత్‌ ఉన్నారు. ఆర్థిక సమస్యలు, మానసిక వేదనతో ఈ చర్యకు పాల్పడ్డాడని మృతుని భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈనెల 23వ తేదీన శనివారం సాయంత్రం సెల్‌ఫోన్‌, పర్సు, తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అన్నీ ఇంట్లోనే ఉంచేసి విధులకు వెళ్లిపోయాడు. ఉదయం ఎంతసేపటికి ఇంటికి రాకపోవడం, సెల్‌ఫోన్‌ ఇంటిలోనే ఉంచి వెళ్లిపోవడంతో అతని భార్య హుటాహుటిన తన భర్త పనిచేస్తున్న కడప రూరల్‌ పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయానికి వెళ్లింది.

అక్కడ ఓ మూలన ఉన్న గదిలో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి వేలాడుతున్నాడు. అతని భార్య బోరున విలపిస్తూ పోలీస్‌స్టేషన్‌ వారి సహకారంతో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని కడప రిమ్స్‌ మార్చురికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చింతకొమ్మదిన్నె ఎస్‌ఐ భూమా అరుణ్‌రెడ్డి తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement