● కంప్యూటర్లు, ఫర్నీచర్ దగ్ధం
కోదాడరూరల్ : మండల పరిధిలోని చిమిర్యాల జెడ్పీహెచ్ఎస్లో శనివారం షార్ట్ సర్క్యూట్ జరిగి ఫర్నీచర్, నాలుగు కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న యువకులు మంటలను గమనించి ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయగా.. వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఫైరింజన్ రావడం ఆలస్యమైతే రికార్డులు, పుస్తకాలు కూడా కాలిపోయేవని గ్రామస్తులు తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
నార్కట్పల్లి: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి వెండి, నగదు అపహరించారు. ఈ ఘటన నార్కట్పల్లి మండలం ఎడవల్లి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎడవెల్లి గ్రామానికి చెందిన పాశం గోపాల్రెడ్డి శనివారం తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో హైదరాబాద్కు వెళ్లాడు. వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి తాళం తీసి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని 16 తులాల వెండి, రూ.6వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్పల్లి పోలీసులు తెలిపారు.
12 తులాల వెండి అపహరణ
మోత్కూరు : మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో శనివారం తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన కొల్లు నర్సమ్మ ఈ నెల 2న తన ఇంటికి తాళం వేసి హైదరాబాద్లో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లింది. శనివారం ఉదయం గ్రామానికి తిరిగి వచ్చి ఇంటి వద్దకు వెళ్లగా తలుపు తీసి ఉండటం గమనించింది. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు కూడా తెరిచి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించారు. బీరువాలో దాచి ఉంచిన 12 తులాల వెండి, సుమారు రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్కుమార్ తెలిపారు.
బైక్ ఢీకొని వృద్ధుడు మృతి
భూదాన్పోచంపల్లి : రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి భూదాన్పోచంపల్లి మండలంలోని అలీనగర్లో జరిగింది. ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అలీనగర్ గ్రామానికి చెందిన శ్యామల రామస్వామి(80) శుక్రవారం రాత్రి తన ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డు అవతల మూత్రవిసర్జన చేసి తిరిగి ఇంట్లోకి వెళ్తుండగా.. బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామస్వామి కాళ్లు విరిగి, చేతులకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పపత్రికి తరలించారు. మృతుడికి భార్య, వివాహితులైన కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి కుమారుడు బాలనర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
గర్తుతెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
చిట్యాల : చిట్యాల శివారులో రైలు పట్టాలపై శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు నల్లగొండ రైల్వే స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మృతుడు వారం రోజుల క్రితం రైలు నుంచి జారి పడి మృతిచెందినట్లుగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు 40 నుంచి 45 ఏళ్లు ఉంటాయని, గోధుమ రంగు షర్ట్, నలుపు రంగు డ్రాయర్ ధరించాడని పేర్కొన్నారు. నల్లగొండ రైల్వే స్టేషన్ మాస్టర్ రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్ఐ తెలిపారు.


