కోదాడరూరల్ : పెళ్లిచూపులకు వెళ్లి ఆటోలో తిరిగి వెళ్తుండగా.. స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన హైరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ మండలం దోరకుంట గ్రామ శివారులో శనివారం జరిగింది. కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్తేశ్వరపురం గ్రామానికి చెందిన మూడవత్ నరసింహ, వరలక్ష్మీ దంపతుల కుమార్తెకు పెళ్లి సంబంధం మాట్లాడేందుకు ఆరుగురు కలిసి ఆటోలో ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలోని ఓ తండాకు వెళ్లారు. మాటా ముచ్చట అయిపోయిన తర్వాత తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో కోదాడ మండలం దోరకుంట సమీపంలోకి రాగానే స్కార్పియో వాహనం వెనుక నుంచి ఆటోను ఢీకొట్టడంతో రోడ్డు కిందకు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మూడవత్ కోటేశ్వరరావు(36)కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందగా.. మూడవత్ నరసింహ, వరలక్ష్మి, మూడవత్ మహేంద్రసింగ్నాయక్, అజ్మీర యలమంద తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. వరలక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుడి భార్య లక్ష్మీదుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాల్రెడ్డి తెలిపారు.
ఆటోను ఢీకొట్టిన స్కార్పియో వాహనం
ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు


