విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యం

Jun 7 2026 9:24 AM | Updated on Jun 7 2026 9:24 AM

తరగతులు ప్రారంభించాం కళాశాలకు నాలుగు డిజిటల్‌ బోర్డులు అడ్మిషన్లకు స్పెషల్‌ డ్రైవ్‌ అధ్యాపకుల కొరత లేకుండా చర్యలు

మారిన సిలబస్‌ దృష్ట్యా ప్రత్యేక మెటీరియల్‌

భువనగిరి : ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా ముందుకెళ్తాం. కళాశాలల్లో అన్నిరకాల వసతులతోపాటు ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది’ అని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి బొందుగుల సురేష్‌రెడ్డి అన్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే..

ఇంటర్మీడియట్‌ నిబంధనల ప్రకారం 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 1వ తేదీ నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభించాం. ప్రస్తుతం జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ సారి కళాశాలల్లో మరమ్మతులకు ప్రభుత్వం రూ.2.30 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇప్పటి వరకు 25 శాతం నిధులతో కళాశాలల్లో పనులు పూర్తిచేశాం. భవనాలకు తెలుపు, బ్లూ రంగులు వేయించారు.

ఈ ఏడాది నుంచి ప్రతి కళాశాలకు నాలుగు డిజిటల బోర్డులు అందిస్తాం. రూ.25వేలతో స్పోర్ట్స్‌ సామగ్రి, రూ.50వేలతో ల్యాటరేటరీ సామగ్రి వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం. విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాల పంపిణీ, ఉదయం అల్పాహారంలో భాగంగా పాలు, రాగిజావ, మధ్యాహ్న భోజనం అందిస్తాం.

జిల్లాలో 2025–26 విద్య సంవత్సరానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 2,060 అడ్మిషన్ల వచ్చాయి. 2026–27 విద్యా సంవత్సరానికి కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు కృషిచేస్తున్నాం. కొద్ది రోజుల నుంచి ఉదయం, సాయంత్రం కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ఇంటింటా ప్రచారం కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. మెరిట్‌ మార్కులు సాధించినవారిని ప్రోత్సహిస్తున్నాం. గతేడాది కంటే ఈ సారి అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందనే నమ్మకం ఉంది.

అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో తరగతి గదులు, అధ్యాపకుల కొరత ఏ మాత్రం లేదు. ఎక్కడైన అలాంటి పరిస్థితి ఉంటే అక్కడ గెస్ట్‌ ఫ్యాకల్టీని ఇంటర్‌ బోర్డు ద్వారా నియమించబడుతుంది. జిల్లాకు ఇంటర్‌ బోర్డు ప్రత్యేక అధికారిగా బీమ్‌ సింగ్‌ను నియమించారు. ఆయన పర్యవేక్షణలో ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ అభిలాష్‌ అభినవ్‌ సూచనల మేరకు నడుచుకుంటాం.

2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఫలితాల్లో 62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంతో 14వ స్థానం, 2025–26 సంవత్సరానికి 64 శాతం ఉత్తీర్ణతతో 16వ స్థానంలో నిలిచింది. 2026–27 విద్యా సంవత్సరంలో మెరుగైన ఉత్తీర్ణత సాధిస్తాం. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో మారిన సిలబస్‌ను దృష్టిలో పెట్టుకున్న అనుభవం ఉన్న అధ్యాపకుల ద్వారా ప్రత్యేకంగా మెటీరియల్‌ తయారు చేయిస్తాం. సిలబస్‌ను త్వరగా పూర్తిచేసి సెప్టెంబర్‌ నుంచే ప్రత్యేక తరగతులు, గ్రాండ్‌ టెస్టులు నిర్వహిస్తాం.

ఫ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో వసతుల కల్పనకు ప్రాధాన్యం

ఫ ప్రతి కళాశాలలో డిజిటల్‌ క్లాస్‌లు

ఫ ఈ ఏడాది నుంచి ఉదయం

అల్పాహారం, మధ్యాహ్న భోజనం

‘సాక్షి’తో జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి సురేష్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement