భువనగిరిటౌన్ : ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వి.మాధవి లత కోరారు. శనివారం ఆమె జిల్లాలోని జూనియర్ సివిల్ జడ్జీలు, అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీలు, ఏపీపీఓలు, ఎకై ్సజ్ పోలీస్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రాజీ పడదగిన కేసులను త్వరగా గుర్తించి కక్షిదారులకు వెంటనే నోటీసులు అందజేయాలని ఆదేశించారు. జాతీయ లోక్ అదాలత్పై విస్తృత ప్రచారం చేయాలన్నారు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం న్యాయ సేవా సంస్థ కార్యదర్శి వి.మాధవి లత భువనగిరిలోని గ్రేస్ చిల్డ్రన్ హోంను సందర్శించారు. బాలురకు వివిధ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు.
యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట : శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజలు జరిగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలను జరిపించారు. ఆలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలను నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం జరిపారు. సాయంత్రం జోడు సేవలను ఊరేగించారు.
అంకితభావంతో సేవలందించాలి
నల్లగొండ టూటౌన్ : ప్రతి ఉద్యోగి అంకితభావంతో సేవలందించాలని ఎంజీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శనివారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో బోధనేతర సిబ్బందికి నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నైతికత, కార్యనిబద్ధత, సంస్థకు నిజమైన సేవ అని ప్రతి ఉద్యోగి దార్శనిక ప్రమాణాలతో నడవాలంటూ సూచించారు. మౌలానా ఆజాద్ ఉర్దూ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ రిజిస్ట్రార్ అబ్దుల్ రషీద్షేక్, డాక్టర్ ఖుద్ధుస్ మాట్లాడుతూ జాతీయ స్థాయి సంస్థలతో సంబంధాల ద్వారా శిక్షణ, నిధి, మార్గదర్శక సహకారాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, సిబ్బంది పాల్గొన్నారు.


