
యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో పాటు శ్రావణమాసం కలిసి రావడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధుల్లో భక్తులు ఎక్కువగా కనిపించారు. స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 30 నిమిషాల సమయం పట్టింది. స్వామిని 30వేలకు పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.37,49,950 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.