
నీటిసంపులో పడి బాలుడు మృతి
చింతపల్లి: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చింతపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గండికోట మురళి– సరస్వతిలకు కుమారుడు గండికోట సతీష్ ఉన్నాడు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లారు. వేసవి సెలవులు కావడంతో సతీష్ ఇంటి వద్దే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో జారి పడ్డాడు. వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు తమ కుమారుడి కోసం వెతికారు. సతీష్ నీటి సంపులో విగతజీవుడిగా పడి ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరై విలపించారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
ఆర్టీసీ బస్సు ఢీకొని
వ్యక్తి మృతి
కొండమల్లేపల్లి : ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. అనుముల మండలానికి చెందిన వంగాల లవయ్య (48) ద్విచక్రవాహనంపై దేవరకొండలో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లి గ్రామ సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిలుకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో లవయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య వంగాల మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామ్మూర్తి తెలిపారు.