
ఎస్సీ గురుకులాల్లో ఫోన్ మిత్ర
చాలా సంతోషంగా ఉంది
అమ్మానాన్నతో మాట్లాడాలని అనిపించినప్పుడు మా వద్ద ఫోన్ లేకపోవడంతో మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు పాఠశాలలో ఫోన్ బాక్స్లు ఏర్పాటు కావడంతో అమ్మానాన్నతో ఎప్పుడైనా మాట్లాడుకునే అవకాశం లభించడం చాలా సంతోషంగా ఉంది. – జోత్స్న, 7వ తరగతి,
ఎస్సీ గురుకుల పాఠశాల, బీబీనగర్
విద్యార్థులకు ఇబ్బందులు తప్పాయి
తల్లిదండ్రులతో విద్యార్థులు మాట్లాడుకోవడానికి ఎస్సీ గురుకుల పాఠశాలల్లో టెలిఫోన్ బాక్స్లు ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఇప్పటి వరకు విద్యార్థులు తమ హౌస్ మాస్టర్ అయిన టీచర్ ఫోన్ ద్వారా తల్లిదండ్రులతో మాట్లాడేవారు. ఇప్పుడు విద్యార్థులకు ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. – రూప, ప్రిన్సిపాల్,
ఎస్సీ గురుకుల పాఠశాల, బీబీనగర్
● ప్రతి పాఠశాలలో
10 టెలిఫోన్ బాక్స్లు ఏర్పాటు
● విద్యార్థులే నేరుగా ఫోన్లో తమ
తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం
● ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
బీబీనగర్: ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఫోన్ మిత్ర పేరిట ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. గురుకులాల్లో చదివే తమ పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడాలంటే ఫోన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడేవారు. ఏదైనా అత్యవసరం ఉంటే టీచర్ ఫోన్కు చేయడం తప్పితే.. సాధారణంగా మాట్లాడాలంటే తల్లిదండ్రులు హాస్టల్కు రావాల్సిందే. కానీ ఈ ఫోన్ మిత్ర కార్యక్రమం ద్వారా విద్యార్థులు కావాల్సినప్పుడల్లా తమ తల్లిదండ్రులతో నేరుగా ఫోన్లో మాట్లాడుకునే సౌకర్యం ప్రభుత్వ కల్పిస్తోంది.
10 టెలిఫోన్ బాక్సులు ఏర్పాటు
ఫోన్ మిత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎస్సీ గురుకుల పాఠశాలలో గరిష్టంగా 10 టెలిఫోన్ బాక్స్లను ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 29 ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉండగా.. 15వేలకు పైగా విద్యార్థులు వాటిల్లో చదువుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉండగా.. బీబీనగర్లోని ఎస్సీ గురుకుల పాఠశాలలో 720 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ గురుకులాల్లో టెలిఫోన్ బాక్స్లను విడతల వారీగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.
ప్రత్యేక యాక్సిస్ కార్డుతో..
విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ నంబర్లు ఆయా పాఠశాలల్లోని టెలిఫోన్ బాక్స్లలో నిక్షిప్తమై ఉంటాయి. తల్లిదండ్రులతో మాట్లాడాలనుకున్న విద్యార్థులకు ప్రత్యేకంగా పంపిణీ చేసే యాక్సిస్ కార్డులను స్వైప్ చేసి ఉచితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇన్నాళ్లు తల్లిదండ్రులతో మాట్లాడాలంటే అది కూడా అత్యవసరమైతేనే 40మంది విద్యార్థులకు కలిపి ఉండే హౌస్ మాస్టర్ అయిన టీచర్ను అడిగి ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఫోన్ మిత్ర కార్యక్రమం ద్వారా విద్యార్థులు నేరుగా తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి ఫోన్ భాక్స్లు ఏర్పాటు కావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సీ గురుకులాల్లో ఫోన్ మిత్ర

ఎస్సీ గురుకులాల్లో ఫోన్ మిత్ర