పోలవరం రూరల్: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు పోలవరం డీఎస్పీ కె. జయకృష్ణ మంగళవారం పట్టిసీమ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ప్రాణనష్టం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రాంతంలో తగినంత విద్యుత్ దీపాలు, రక్షణ బోట్లు, లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తులు, ప్రజల భద్రతకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అంతకుముందు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఆర్ఎస్ రాజు, సీఐ బి.కృష్ణకుమార్, ఎస్సై పి.అప్పారావు, ఎంపీడీవో జి.మణికుమారితో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని కోరారు.


