ఉంగుటూరు: మండలంలో వరి పంట పొలాలు పిలకలు తొడిగే దశకు చేరాయి. ప్రస్తుతానికి పంట ఆశాజనకంగానే కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇటీవల కురిసిన అడపా దడపా చినుకులు పంటను ఆశాజనకమైన స్థితికి తీసుకువచ్చాయి. ఈ మండలంలో 26 వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఇంత విస్తీర్ణంలో సాగు జరగడం ఏలూరు జిల్లాలోనే అత్యధికం కావడం విశేషం. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవలేదు. దాంతో నాట్లు వేసిన మొదలు వరి ఆశించిన విధంగా ఎదగలేదు. పంట ఏపుగా కనిపించలేదు. అయినప్పటికీ, మండలంలో గోదావరి కాలువల ద్వారా సాగునీరు అందుబాటులో ఉండటం, బోరుబావుల కింద ఎక్కువ విస్తీర్ణంలో సాగు జరగడంతో సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఫలితంగా పంట చేలు కాస్త కోలుకుని ఏపుగా ఎదిగాయి. ప్రస్తుతం పంటకు 50 నుంచి 60 రోజులు పూర్తయ్యి, పిలకలు తొడిగే దశ (టిల్లరింగ్)కు చేరుకుంది. ప్రధానంగా నీటి ఎద్దడి, కీటకాల దాడి, తెగుళ్లు ఎక్కువగా లేకపోవడంతో ప్రస్తుత పరిస్థితి బాగానే ఉంది. పంట ఆరోగ్యకరంగానే ఉంది.
వేప ఆధారిత
ద్రావణాలు వాడితే మేలు
వేప ఆధారిత ద్రావణాలు వాడితే వరి పంటకు మేలు జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి ఎన్. ప్రవీణ్కుమార్ తెలిపారు. సహజసిద్ధమైన ద్రావణాలను వాడటం ద్వారా భూమి ఆరోగ్యవంతంగా ఉండటంతోపాటు పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు సాగు వ్యయం కూడా తగ్గుతుందని ఏఈవో తెలిపారు. రైతులు పొలాల్లో నీటి మట్టాన్ని అవసరానికి అనుగుణంగా నిర్వహిస్తూ, కలుపు మొక్కల నియంత్రణ, పోషక లోపాలు, పురుగుల లక్షణాలను ఎప్పటికప్పుడు గుర్తించాలని రైతులకు సూచించారు. సాగుకు సంబంధించిన అన్ని రకాల సూచనలు, సలహాలు ఇవ్వడానికి తాము రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటామని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్కుమార్ తెలిపారు. మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో కూడా సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రవీణ్కుమార్, ఏఓ, ఉంగుటూరు
ఆశాజనకంగా వరి సాగు


