ఆకివీడు: వచ్చే ఖరీఫ్ సీజన్లో గోదాముల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు జేసీ కేఆర్ కల్పశ్రీ అన్నారు. సిద్ధాపురం శివారు నందమిల్లిపాడులోని ప్రైవేట్ ఎఫ్సీఐ గోదామును బుధవారం ఆయన పరిశీలించారు. జిల్లాలో బియ్యం నిల్వలకు గోదాముల కొరత ఉందని, గొడౌన్లలో నిల్వల పరిస్థితిని అంచనా వేసి, పంట దిగుబడులు వచ్చేసరికి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామన్నారు. ఇక్కడి గొడౌన్లో నిల్వ, డెలివరీ విష యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆకివీడులో 20వ నంబర్ రేషన్ షాపును తనిఖీ చేశారు. దివ్యాంగులు, వృద్ధులకు ఇంటికే రే షన్ అందించాలని ఆదేశించారు. సివిల్ సప్లయీస్ జిల్లా అధికారి సరోజినీ, ఏఎస్ఓ రవి శంకర్, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్, తహసీల్దార్ వంశీ, ఇన్చార్జి డీటీ ఆంజనేయులు, డీలర్ల సంఘ అధ్యక్షుడు కొట్టుమాణిక్యాలరావు ఉన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మావుళమ్మ ఆలయంలో సంపూర్ణ స్వర్ణమయం ప్రాజెక్ట్ కోసం ఏర్పాటు చేసిన హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. రూ.3,02,696 నగదు, 16.700 గ్రాముల బంగారం లభించాయి. అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఎండోమెంట్ తనిఖీదారు పీఎస్ సాయికుమారి, చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు పర్యవేక్షించారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ ఆలీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు ఉమ్మడి జిల్లా ఏ డీఏ చక్రవర్తిని కూడా సస్పెండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో మత్తు ఇంజక్షన్లు, అబార్షన్ కిట్ల విక్రయాల నేపథ్యంలో శాఖాపరమైన చర్యలు, పర్యవేక్షణ లోపం కారణంగా సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
తాడేపల్లిగూడెం: చవితి ఉత్సవాల్లో డీజేలు నిషేధ మని డీఎస్పీ యు.రవి చంద్ర తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వినాయక విగ్రహాల ఏర్పాటులో ముందస్తుగా అనుమతి తప్పనిసరని, మండపాల వద్ద విద్యుత్ భద్రతా ప్రమాణాలు, అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే మైక్ వినియోగంలో శబ్ధ కాలుష్య నిబంధనలను పాటించాలన్నారు. చెరువులు, కాలువలు వద్ద నిమజ్జన సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఐ బోణం ఆదిప్రసాద్, ఎస్సైలు బి.శ్రీనివాసు, జె.వెంకటరమణ, డి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఏలూరు టౌన్: జీతాల బకాయిల బి ల్లుల మంజూరుకు సొమ్ములు డిమాండ్ చేసిన ఏలూరు జెడ్పీ సీఈఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ మాతంగి పవిత్రన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ప ట్టుకున్నారు. ఏ లూరు పాతబస్టాండ్ సమీపంలో బుధవారం ట్రాప్ వేసిన అధికారులు రూ.5 వేలు తీసుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీఓ కార్యాలయంలో మండల కో–ఆర్డినేటర్గా పనిచేస్తున్న సరిపల్లి తేజశ్రీకి 2023 నుంచి జీతాలు నిలిచిపోయాయి. జీతాల బిల్లులను ట్రెజరీకి ప్రాసెస్ చేసేందుకు ఆమె జెడ్పీ సీఈఓ కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఇందుకు పవిత్రన్ రూ.5 వేలు డిమాండ్ చేశారు. బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. పక్కా స్కెచ్ వేసి ట్రాప్నకు రంగం సిద్ధం చేశారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో బృందం పాత బస్టాండ్ వద్ద మాటువేశారు. తేజశ్రీ నుంచి రూ.5 వేల సొమ్ములను పవిత్రన్ తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ లంచం డిమాండ్ చేసే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి ఎవరైనా అధికారులు, ఉద్యోగి సొమ్ములు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఏసీబీకి ఫిర్యాదు వస్తే అవినీతి అధికారులు, ఉద్యోగులకు ట్రాప్ తప్పదని హెచ్చరించారు.


